(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీకారం చుట్టింది. ఫలితంగా దేశంలోని ఒక్క శాతం మంది దగ్గర ఏకంగా 40 శాతం సంపద పోగుపడింది. 70 కోట్ల మంది భారతీయుల దగ్గర ఉన్న సంపదకు సమానమైన మొత్తం కేవలం 21 మంది దగ్గర మూలుగుతున్నది. దేశంలో టాప్-100 సంపన్నుల వద్ద ఉన్న డబ్బు రూ. 53.88 లక్షల కోట్లుగా తేలింది. ఈ డబ్బుతో 18 నెలలపాటు దేశాన్ని నడుపొచ్చు. బీజేపీ హయాంలో దేశంలో ఆర్థిక అసమానతలు ఏ మేరకు పెరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గడిచిన 9 ఏండ్లలో కేంద్రం తీసుకొన్న ఐదు కీలక నిర్ణయాలు కార్పొరేట్ల సంపద తారా జువ్వలా దూసుకుపోవడానికి కారణమైంది.
నిర్ణయం 1: కార్పొరేట్ పన్ను కోత
2019లో కార్పొరేట్ పన్నును 30% నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. దీంతో రూ.1.45 లక్షల కోట్లను చెల్లించకుండా కార్పొరేట్ కంపెనీలకు ఉపశమనం లభించింది. దేశం మొత్తం జీఎస్టీ వసూళ్లలో 64% పేదలు కడుతుంటే, టాప్-10 సంపన్నులు కడుతున్నది 4 శాతమే.
నిర్ణయం 2: బ్యాంక్ రైటాఫ్లు
గత తొమ్మిదేండ్లలో బ్యాంకులు రూ.14.38 లక్షల కోట్లను రైటాఫ్ చేశాయి. రూ.100 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న రుణాలే ఇందులో ఎక్కువ. బీజేపీ హయాంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య ఏకంగా 10 రెట్లు పెరిగింది. తమ బకాయిలను ఎలాగైనా రద్దు చేస్తారన్న ధీమానే దీనికి కారణం.
నిర్ణయం 3: ‘బంగారు బాతుల’ విక్రయం
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టింది. రూ.లక్షల కోట్ల విలువ చేసే బంగారు బాతుల వంటి నవరత్న, మినీరత్న కంపెనీలను కేవలం రూ. 4.86 లక్షల కోట్లకే అమ్మేసింది. 1991 నుంచి జరిగిన పెట్టుబడుల ఉపసంహరణలో మోదీ సర్కారు వాటా 72 శాతం.
నిర్ణయం 4: లీజుకిచ్చి… పెట్టుబడులు తెప్పించి
ప్రభుత్వ ఆదాయానికి కీలకమైన రైల్వే లైన్లు, టెలికం సిస్టమ్స్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఆయిల్, గ్యాస్ గ్యాస్ పైప్ లైన్స్, రోడ్లు, బ్రిడ్జీలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు గనులను కార్పొరేట్ కంపెనీలకు 40 ఏండ్ల పాటు లీజుకు ఇస్తూ కేంద్రం పలు నిర్ణయాలు తీసుకొంది. దీంతో ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల వరద పారింది.
నిర్ణయం 5: కార్పొరేట్ కంపెనీలపై రాయితీలు
ప్రజా సంక్షేమం కంటే లాభార్జనే ధ్యేయంగా పనిచేసే కార్పొరేట్ కంపెనీలను ఉత్పాదకతతో సంబంధం కలిగిన ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం కింద తీసుకొస్తున్న కేంద్రం.. వాటిపై రాయితీల వర్షాన్ని కురిపిస్తున్నది. దీంతో జాతి సంపద యథేచ్ఛగా ప్రైవేటు సెక్టార్కు తరలిపోతున్నది. 9 ఏండ్లలో ఐదు నిర్ణయాలతో కేంద్రం కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చింది.