Adani Group | న్యూఢిల్లీ, మార్చి 2: అదానీ- హిండెన్బర్గ్ వివాదం విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యుల ప్యానల్ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నాయకత్వం వహించే ఈ ప్యానల్లో ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవ్ధర్, కేబీ కామత్, నందన్ నీలేఖని, సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి మదుపర్లను మోసం చేశారన్న ఆరోపణలపై ఈ ప్యానల్ విచారణ జరుపనున్నది.
అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఈ అంశంపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
ఆరుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటిస్తూ , దాని విధులను కూడా స్పష్టంగా పేర్కొన్నది. అదానీ గ్రూప్లో ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా అంచనావేసి, మదుపర్ల ప్రయోజనాల రక్షణకు సూచనలు చేయాలని.. ప్రస్తుతం ఉన్న స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి సూచనలు చేయాలని ఆదేశించింది. ఈ ప్యానల్కు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సహకారం అందించాలని సూచించింది. విచారణ రెండు నెలల్లో పూర్తిచేసి నివేదిక అందించాలని ఆదేశించింది. కోర్టు ప్రత్యేకంగా ప్యానల్ను ఏర్పాటుచేయటం అంటే హిండెన్బర్గ్ రిపోర్టుపై సెబీ దర్యాప్తు చేయకూడదని అర్థంకాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై దర్యాప్తు కమిటీలో సభ్యుల పేర్లను తామే సీల్డ్ కవర్లో అందిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గత నెల 17న తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్యానల్ ఏర్పాటుపై గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో షేర్ల ధరల్ని మోసపూరితంగా హెచ్చుతగ్గులకు గురిచేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీని సుప్రీం కోర్టు ఆదేశించింది. నియంత్రణాపరమైన విషయాల వెల్లడిలో ఏవైనా ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపైనా దర్యాప్తు చేయాలని కోరింది. రెండు నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. సెబీ ప్రస్తుతం జరుపుతున్న దర్యాప్తును సుప్రీం బెంచ్ పరిగణనలోకి తీసుకుంటూ అదానీ గ్రూప్నకు సంబంధించిన పలు ఇతర ఆరోపణల్ని సైతం సెబీ తన దర్యాప్తులో భాగంగా చేయాలని పేర్కొంది. సెక్యూరిటీల కాంట్రాక్టులు (రెగ్యులేషన్) నిబంధనల్లో ఉల్లంఘన ఏమైనా జరిగిందేమో నిగ్గు తేల్చాలని సెబీని సుప్రీం ఆదేశించింది.
అలాగే సంబంధిత పార్టీల (సంస్థలు)తో జరిపిన లావాదేవీలను వెల్లడించకపోవడం, సంబంధిత పార్టీలకు చెందిన సమాచారాన్ని సెబీకి తెలియపర్చకపోవడం వంటి అంశాల్ని సైతం దర్యాప్తులో చేర్చాలన్నది. తన ఆదేశాలకు మించి ఇతర అంశాలనూ సెబీ శోధించవచ్చని, దర్యాప్తు రెండు నెలల్లో పూర్తిచేసి, స్టాటస్ రిపోర్ట్ను ఫైల్ చేయాలని బెంచ్ ఆదేశించింది. ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానానికి సెబీ ఒక నోట్ దాఖలు చేసింది. షార్ట్ సెల్లింగ్ను లేదా అరువుకు తీసుకున్న షేర్లను విక్రయించడాన్ని నిషేధించడానికి తాను అనుకూలం కాదని సెబీ ఆ నోట్లో పేర్కొంది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ యూఎస్లో ట్రేడయ్యే అదానీ కంపెనీల బాండ్లు, ఆఫ్షోర్ డెరివేటివ్ కాంట్రాక్టుల్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్టు తెలిపిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు సెబీ ఈ వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపైనా, ఆ గ్రూప్ కంపెనీల షేర్ల కదలికలపైనా తాను దర్యాప్తు చేస్తున్నట్టు సుప్రీం బెంచ్కు సెబీ వెల్లడించింది.