న్యూఢిల్లీ, మే 10: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణకు ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు తమ నివేదికను సమర్పించింది. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్నది. అదానీ గ్రూప్ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో సంచలన నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమవగా, వేల కోట్ల రూపాయల ప్రజల సంపద ఆవిరైపోయింది. పార్లమెంట్, వెలుపల విపక్షాలు పెద్దఎత్తున ఈ వ్యవహారంపై ఆందోళనలూ చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే జేపీసీ వేయాలంటూ డిమాండ్ చేశాయి. అయితే దీనిపై ఎంత పట్టుబట్టినా మోదీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించింది. ఫలితంగా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. దీనిపై సమగ్రంగా విచారించిన సదరు కమిటీ.. సీల్డ్ కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి తమ నివేదికను సమర్పించింది.