Gold Price | న్యూఢిల్లీ, మార్చి 24: బంగారం ధర ఒక్క ఉదుటన రూ.60,000 స్థాయిని చేరిన నేపథ్యంలో పాత పుత్తడి ఆభరణాల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఉగాది, గుడిపౌర్వ, నవరాత్రి తదితర పండుగలతో దేశీయంగా కొత్త సంవత్సరం ఆరంభమైన బుధవారం ఈ అమ్మకాలు పెరిగాయని జ్యువెలర్లు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది పాత ఆభరణాల అమ్మకాలు 25 శాతం మేర అధికంగా జరిగాయన్నారు. అమ్మకాలు ఊపందుకోవడానికి రికార్డు ధరే కారణమని వివరించారు.
సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలు పన్ను ఆదా పత్రాలపై దృష్టి ఉంటుందని, దాంతో ఈ నెలల్లో పుత్తడి కొనుగోళ్లు తగ్గుతాయని రిద్ధిసిద్ధి బులియన్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పన్ను ఆదా పత్రాల్లో మదుపు చేసేందుకు ఈ సీజన్లో ప్రజలు బంగారాన్ని సొమ్ము చేసుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, దీనికి అధిక ధరే కారణమని వెల్లడించారు. పిల్లల విద్యా వ్యయాల కోసం కూడా కొంతమంది పాత ఆభరణాల్ని విక్రయిస్తున్నారని అన్నారు.