న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ ఏడాది దేశంలో ఇండ్ల అమ్మకాలు రికార్డుస్థాయిలో జరగ్గా, అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2022 సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్లో గృహ విక్రయాలు అత్యధికంగా 87 శాతం వృద్ధిచెందినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ ఏడాది భారత్లోని ఏడు నగరాల్లో 3.65 లక్షల యూనిట్ల రికార్డు గరిష్ఠస్థాయి గృహ విక్రయాలు జరిగాయని, 2014లో నమోదైన రికార్డును మించడం విశేషమని అనరాక్ తెలిపింది. ప్రధాన ఏడు నగరాల్లో 2014 లో 3.43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ సంఖ్యను మించి 2022లో విక్రయాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. ముడి ఉత్పత్తుల వ్యయం అధికంకావడంతో రెసిడెన్షియల్ ఆస్తుల ధరలు 4 నుంచి 7 శాతం పెరిగినా, కొవిడ్ సంక్షోభం తదుపరి డిమాండ్ ఊపందుకుందని పేర్కొంది. వివరాలు..
కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్, ఎంఎంఆర్లదే అగ్రస్థానం
ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా నిర్మాణమైన ఇండ్లు 2022లో 3,57,600 యూనిట్లకు చేరాయని అనరాక్ వెల్లడించింది. 2021లో నమోదైన 2,36,700 యూనిట్లకంటే ఈ ఏడాది 51 శాతం పెరిగాయి. ఈ నగరాల్లో హైదరాబాద్, ఎంఎంఆర్ల్లోనే కొత్త రెసిడెన్షియల్ యూనిట్లు అధికంగా వచ్చాయన్నది. ప్రాపర్టీ ధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు, బౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు తదితర సమస్యలున్నప్పటికీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కు 2022లో శుభ సంవత్సరంగా గడిచిందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు. ఏడు ప్రధాన నగరాల్లో విక్రయం జరగని యూనిట్ల నిల్వ గత ఏడాదికంటే 1 శాతం తగ్గి 6,30,953 యూనిట్లకు దిగివచ్చినట్టు కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది. 2013-14 నుంచి రియల్ ఎస్టేట్ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నదని, అయితే 2022 ఏడాది గొప్ప ఊరటనిచ్చిందని త్రెహన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష త్రెహన్ పేర్కొన్నారు.