వరుసగా మూడోవారం సైతం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 229 పాయింట్లు లాభపడి 17,828 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి నెల ద్రవ్యోల్బణం అటు అమెరికాలోనూ, ఇటు భారత్లోనూ తగ్గడంతో బ్యాంకింగ్, ఆటో షేర్లు పెరగ్గా, కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఫార్మా షేర్లు పుంజుకున్నాయి. అయితే శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించిన ఫలితాలు పెద్ద షాకివ్వడం, శనివారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సానుకూల ఫలితాల్ని వెల్లడించిన నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో మార్కెట్ కొంత హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఫెడ్ వడ్డీ రేట్ల తీరుపై వెలువడే వార్తలు, కార్పొరేట్ ఫలితాలు ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేస్తాయన్నారు.
ఈ వారం నిఫ్టీకి 17,550 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని, 18,000 పాయింట్ల స్థాయి అవరోధం కల్పించవచ్చని సామ్కో వెంచర్స్ సీఈవో జిమిత్ మోదీ చెప్పారు. వరుసగా రెండు రోజులపాటు 17,800పైన నిఫ్టీ ముగిసినందున, కొద్ది రోజల కన్సాలిడేషన్ అనంతరం 18,200-18,250 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ మిలీన్ వాసుదేవ్ అంచనా వేశారు. విదేశీ ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ కారణంగా కొద్ది రోజుల్లో నిఫ్టీ 18,200 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చని ఇన్క్రెడ్ అల్ట్రనేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రిషి కొహ్లి అంచనాల్ని వెల్లడించారు.