Home Loans Costly | ధరలను కట్టడి చేసే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నాలుగో దఫా రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. రెపోరేట్కు అనుగుణంగా వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచనున్నాయి. 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో ఆర్బీఐ రెపోరేట్ 5.90 శాతానికి దూసుకెళ్లింది. తదనుగుణంగా బ్యాంకులు తమ రెపోరేట్గా ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ను పరిగణిస్తున్నాయి. మరో దఫా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్లను సవరించనున్నాయి. మేలో తొలిసారి రెపోరేట్ పెంచకముందు 6.5 నుంచి ఏడు శాతం మధ్య వడ్డీరేట్పై లభించే ఇండ్ల రుణాలు.. ఇప్పుడు 8.5 శాతాన్ని దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆర్బీఐ రెపోరేట్.. కరోనా మహమ్మారి ముందు స్థాయి కంటే పెరిగింది.
సత్య ప్రకాశ్ అనే ఐటీ ఉద్యోగి.. కొత్త ఇంటి కొనుగోలు కోసం రూ.30 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఏప్రిల్లో 6.5 శాతం వడ్డీపై ప్రతి నెలా వడ్డీతో కలిపి ఈఎంఐ రూ.20,256 కాగా, ఇప్పుడు రెపోరేట్ 5.9 శాతానికి పెంచడంతో నెల సరి వాయిదా రూ.23,955 పెరుగుతుంది. అంటే రూ.3699 ఈఎంఐ భారం పెరుగుతుందన్న మాట. ఇప్పుడు సత్య ప్రకాశ్ ప్రతి రూ.లక్ష రుణంపై ఈఎంఐ రూ.123 పే చేయాల్సి ఉంటుంది.
బ్యాంకులు కూడా సంబంధిత రుణ గ్రహీత వయస్సు, వేతనం, సిబిల్ స్కోర్, పని చేస్తున్న రంగం ఆధారంగా రుణం మంజూరు చేస్తాయి. వడ్డీరేటు పెరిగినప్పుడు లభించే రుణ మొత్తం తగ్గుతుంది. ఇప్పుడు రెపోరేట్ 5.9 శాతానికి పెరిగినందున రూ.30 లక్షల రుణానికి బదులు రూ.25.40 లక్షలు మాత్రమే మంజూరవుతుంది.
వర ప్రసాద్ అనే మరో ఆటోమొబైల్ ఇంజినీర్ గత ఏప్రిల్లో ఏడేండ్ల గడువుపై పదిశాతం వడ్డీపై రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. దీనిపై నెల వారీ వాయిదా (ఈఎంఐ)గా రూ.16,601 పే చేస్తున్నాడు. ఇప్పుడు రెపోరేట్ పెరిగిపోవడంతో ఇప్పుడు ఈఎంఐ భారం రూ.998 పెరిగింది. అంటే ఈఎంఐగా రూ.17,599 చెల్లించాలన్న మాట.
వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకుంటాయి. రెపోరేట్ పెరుగుదలకు అనుగుణంగా ఆయా బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీరేటు పెరుగుతుంది. పెరిగిన వడ్డీరేట్లను బ్యాంకులు తమ వద్ద రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలపై మోపుతాయి. ఇందుకోసం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్)ను రెపోరేట్గా పరిగణిస్తాయి. ఈబీఎల్ఆర్ పెంచేయడంతో కొత్తగా రుణాలు తీసుకోవాలనుకున్న వారిపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే రుణాలు తీసుకుంటే ఈఎంఐ భారం పెరుగుతుంది. ఈఎంఐ యధాతథంగా కొనసాగాలని కోరుకుంటే, రుణ గడువు పొడిగిస్తాయి బ్యాంకులు.