ముంబై, మార్చి 20: ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతున్నది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ డిమాండ్ ధాటికి ఏమాత్రం నిలువలేకపోతున్నది. శుక్రవారం మరో 64 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా, తొలిసారి 93 మార్కును దాటి 93.53 వద్ద నిలిచింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో కొండెక్కిన క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆల్టైమ్ కనిష్ఠ స్థాయిల్లోనే కదలాడుతున్నది. దీంతో ఈ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మరింతగా రూపీ బలహీనపడటం ఖాయమన్న అభిప్రాయాలున్నాయి.
ఓవైపు గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. మరోవైపు భారతీయ దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. ఇంకోవైపు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు అదేపనిగా తరలిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రూపాయి నష్టాలకు దారితీస్తున్నాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా, నష్టపోతున్న రూపాయి మారకం విలువ.. దేశీయ దిగుమతులన్నింటి ధరని మరింత పెంచుతుందని ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం విదేశాల నుంచి వచ్చే దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో రూపాయి పతనం.. యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తున్నదని హెచ్చరిస్తున్నారు.
డాలర్లను అధికంగా చెల్లించి కావాల్సినవి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం ఇంకా పెచ్చుమీరుతుందని అంటున్నారు. అదే జరిగితే జీడీపీ వృద్ధిరేటు, ఉద్యోగావకాశాలు, తయారీ, వినిమయ సామర్థ్యం, కొనుగోలు శక్తి, రుణ లభ్యత.. అన్నీ ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం అవసరమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రూపాయి మారకం విలువ.. ఆర్బీఐ పెట్టుకున్న 92.50 పరిమితిని కూడా దాటిపోయిందని గుర్తుచేస్తున్నారు. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెంచితే కొంత ప్రయోజనం ఉండవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 13తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 7.052 బిలియన్ డాలర్లు తరిగిపోయి 709.759 బిలియన్ డాలర్ల (66.50 లక్షల కోట్లు)కు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 11.683 బిలియన్ డాలర్లు తగ్గి 716.81 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కానీ, ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో మాత్రం 5 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడం వల్లనే రిజర్వులు తగ్గుతున్నాయని పేర్కొంది. గత వారంలోనూ 7.678 బిలియన్ డాలర్లు తగ్గి 555.568 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం, ఇతర కరెన్సీలు కూడా ఒత్తిడికి గురికావడం ఇందుకు కారణం. కాగా,త గోల్డ్ రిజర్వులు 664 మిలియన్ డాలర్లు ఎగబాకి 130.681 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.