న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ఈ ఆర్థిక సంవత్సరం జనవరి చివరినాటికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.11 లక్షల కోట్లకు చేరింది. సవరించిన వార్షిక బడ్జెట్లో పూర్తి సంవత్సరపు రూ.17.35 లక్షల కోట్ల (జీడీపీలో 5.8 శాతం) లక్ష్యంలో ఇది 63.6 శాతం. ప్రభుత్వానికి అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు.
గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరిచివరికల్లా ఇది 67.8 శాతం ఉన్నది. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 2024 జనవరి చివరినాటికి ప్రభుత్వపు మొత్తం వసూళ్లు రూ.22.52 కోట్లు. ఇందులో రూ.18.8 లక్షల కోట్ల పన్ను ఆదాయం, రూ.3.38 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం, రూ.34,219 కోట్ల రుణేతర మూలధన వసూళ్లు ఉన్నాయి. మొత్తం వ్యయం రూ.33.54 కోట్లుకాగా, ఇందులో రూ.26.33 కోట్లు రెవిన్యూ అకౌంట్ ద్వారా, రూ.7.2 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్ ద్వారా వచ్చింది.