Cooking Oil | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్షల కోట్ల దేశ సంపదను విదేశాలకు ధారపోస్తున్నది. వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు ఏకంగా రూ.1.56 లక్షల కోట్ల సంపదను నూనెల దిగుమతి కోసం వెచ్చించటం గమనార్హం. గడిచిన మూడేండ్లలో దిగుమతి విలువ 118 శాతం పెరిగిందంటే ఏ స్థాయిలో మన దేశం నూనెలను దిగుమతి చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతియేట వంటనూనెల కోసం భారతదేశం విదేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ వినియోగంలో కేవలం 40 శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతుంటే మిగిలిన 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతియేట సుమారు 1.40 కోట్ల టన్నుల నుంచి 1.50 కోట్ల టన్నుల నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. 2017-18లో దేశంలో మొత్తం 2.50 కోట్ల టన్నుల నూనె అవసరం కాగా ఇందులో 1.04 కోట్ల టన్నులు దేశీయంగా లభ్యం కాగా మిగిలిన 1.46 కోట్ల టన్నుల నూనెను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇది 2018-19లో మరింత పెరిగి 1.55 కోట్ల టన్నులకు పెరిగింది. ఆ తర్వాత రెండేండ్లు కాస్త తగ్గినా నిరుడు మళ్లీ దిగుమతి పెరిగింది. 2021-22లో 1.42 కోట్ల టన్నుల నూనెలను దిగుమతి చేసుకున్నాం. దేశంలో ఏటికేడు నూనెల వినియోగం పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి మాత్రం పెరగటం లేదు. గడిచిన నాలుగేండ్లలో దేశంలో కేవలం 12 వేల టన్నుల నూనె ఉత్పత్తి మాత్రమే పెరగటం మన దేశంలో నూనెల గింజలసాగు తీరుకు అద్ధం పడుతున్నది.
విదేశాల నుంచి నూనెల దిగుమతి కోసం భారతదేశం భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన మూడేళ్లలో నూనెల దిగుమతి కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 118 శాతం పెరిగింది. 2019-20లో విదేశాల నుంచి నూనెల దిగుమతి కోసం ప్రభుత్వం రూ.71 వేల కోట్లు ఖర్చు చేసింది. అది 2020-21లో ఒక్కసారిగా రూ.1.17 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విధంగా నూనెల దిగుమతి విలువ తొలిసారిగా లక్ష కోట్ల మార్క్ను దాటింది. ఇది అంతటితో ఆగకుండా 2021-22లో రూ.1.56 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20 నుంచి 2020-21 నాటికి నూనెల కోసం చేసిన ఖర్చు 34 శాతం పెరగగా 2019-20 నుంచి 2021-22 నాటితో పోల్చితే చేసిన ఖర్చు 118 శాతం పెరిగింది.
నూనెల దిగుమతితో భారీమొత్తంలో దేశ సంపద విదేశాలకు తరలిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో నూనెగింజల సాగు పెంచి తద్వారా నూనెల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంతమాత్రమేనని చెప్పాలి. 2018-19లో మిషన్ ఆయిల్సీడ్స్, మిషన్ ఆయిల్పామ్ను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. తద్వారా దేశంలో ఆయిల్పామ్ సాగును పెంచటంతో పాటు ఇతర నూనె పంటల సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. కానీ ఇవన్నీ కూడా ప్రణాళికల వద్దే నిలిచిపోయాయనే విమర్శలున్నాయి. నూనె పంటల సాగులో కేంద్రం నుంచి రాష్ర్టాలకు అవసరమైన సహకారం లభించటం లేదని అభిప్రాయాలున్నాయి. దేశంలో నూనెగింజల సాగును పెంచి ఉత్పత్తి పెంచటం ద్వారా వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి, దీన్ని దేశ ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఆ దిశగా కనీస ఆలోచన చేస్తున్నట్టు కనిపించటం లేదు.