న్యూఢిల్లీ, జూన్ 25: దేశవ్యాప్తంగా టెలికాం సబ్స్ర్కైబర్లు వాయువేగంతో దూసుకుపోతున్నారు. మే నెల చివరినాటికి మొత్తం వినియోగదారులు 134 కోట్లకు చేరుకున్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లోకి అదనంగా పలువురు చేరినట్టు తెలిపింది. గత నెలలో ఎయిర్టెల్ నెట్వర్క్లోకి కొత్తగా 29.8 లక్షల మంది చేరగా, వీరిలో 29.26 లక్షల మంది మొబైల్ వినియోగదారులు కాగా, 53,809 ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు అని పేర్కొంది.
అలాగే రిలయన్స్ జియో నెట్వర్క్లోకి కొత్తగా 22.55 లక్షల మంది చేరినట్టు తెలిపింది. వీరిలో 21.54 లక్షల మంది మొబైల్ సెగ్మెంట్నకు చెందిన వారు కాగా, 1.01 లక్షలు ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు. ఏప్రిల్ చివరి నాటికి 133.75 కోట్లుగా ఉన్న టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు.. ఆ తర్వాత నెల చివరినాటికి 134.41 కోట్లకు చేరుకున్నారని ట్రాయ్ తాజా నివేదికలో వెల్లడించింది.