హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నది మరి. తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణలో.. సొంత పన్నుల రాబడి రెండు రెట్లు పెరిగింది. కేంద్రం సహకరించకున్నా.. సొంత కాళ్లపై నిలబడుతూ స్వయం సమృద్ధివైపు సాగుతున్నది. జీఎస్టీ వసూళ్లలోనూ దూసుకుపోతున్నది. మెరుగైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యాపారాభివృద్ధి తదితర కారణాలతో జీఎస్టీ రాబడి అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.28,786 కోట్లు జీఎస్టీ వసూలవగా, 2022-23లో రూ.51,870 కోట్లకు చేరింది. ఐదేండ్లలో జీఎస్టీ రాబడి రూ.23,084 కోట్లు పెరిగింది. ఒకవైపు కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే తక్కువగానే అందుతున్నా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
వాణిజ్య పన్నుల శాఖను స్వయంగా సీఎం కేసీఆరే పర్యవేక్షిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఎన్నో కొత్త సంస్కరణలు వచ్చాయి. అనేక సర్కిళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించారు. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇటువంటి ఎన్నో గొప్ప మార్పులతో రాష్ట్రంలో పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. అందులోభాగంగానే జీఎస్టీలోనూ అనూహ్య వృద్ధిరేటు నమోదైంది.
గత ఐదేండ్లలో రాష్ట్రంలో జీఎస్టీ రాబడి ముఖచిత్రం
ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా రాబడి శాతం
2018-19 34,232 28,786 84
2019-20 31,186 28,053 90
2020-21 32,671 25,905 80
2021-22 35,520 34,489 97
2022-23 42,189 51,870 123