హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో.. ఆ దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. శనివారం ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్ బుక్ 2021-22 నివేదిక ప్రకారం తెలంగాణకు తిరుగులేదని మరోసారి రుజువైంది. గడిచిన ఎనిమిదేండ్లలో బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కక్షగట్టి ఆర్థికంగా అణగదొక్కేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నా.. తనకాళ్లపై తానే నిలబడుతూ దినదినాభివృద్ధి చెందుతున్నది తెలంగాణ. 2014-15లో సొంత పన్నుల రాబడి రూ.29,288 కోట్లుగా ఉంటే, 2021-22కు అది ఏకంగా రూ.92,910 కోట్లకు చేరింది.
అంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సొంత పన్నుల రాబడి మూడు రెట్లు పెరిగిందన్నమాట. పైగా వచ్చిన రాబడిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తూ మరింత ఆర్థిక పురోగతిని సాధిస్తున్నది. అంతేగాక రాబడిలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నది. 2014-15లో మూలధన వ్యయం రూ.11,583 కోట్లు. అయితే ఈ ఎనిమిదేండ్లలో 2021-22 నాటికి రూ.61,343 కోట్లకు పెంచింది. ఇలా.. వచ్చేదాంట్లో ఎక్కువ శాతం ఖర్చు చేస్తూ.. ఏటా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది.
తలసరి ఆదాయం రయ్.. రయ్
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. స్వరాష్ర్టానికి ముందు 2013-14లో రూ.1,12,162 కోట్లుగా ఉన్నది. అయితే 2021-22లో ఇది రూ.2,75,443 కోట్లకు పెరిగింది. అంటే.. రెండున్నర రెట్లు ఎగిసింది. అదేవిధంగా.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జీఎస్డీపీలోనూ గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. తెలంగాణ రాకముందు 2013-14లో రూ.4,51,580 కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 11,48,144 కోట్లకు చేరింది. అంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెరిగింది. ఇది.. డబుల్ ఇంజిన్ సర్కారని గొప్పలు చెప్పుకునే మోదీ సర్కారుతో పోలిస్తే ఎంతో మెరుగైన వృద్ధి రేటు. ఇలా అన్నింటా… ఏడేండ్లలో తెలంగాణ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. దేశంలోని అతిపెద్ద రాష్ర్టాలతో పోలిస్తే.. అతిచిన్న వయస్సు కలిగినప్పటికీ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.