Tata Technologies | న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ షేర్ల కోసం ఐపీవో తొలిరోజునే భారీగా బిడ్ చేశారు. బుధవారం ఆఫర్ ప్రారంభమైనంతనే క్షణాల్లో పూర్తిగా సబ్స్క్రయిబైంది. మొదటిరోజున బిడ్డింగ్ సమయం ముగిసేప్పటికి ఇష్యూకు 6.5 రెట్లకుపైగా ఓవర్సబ్స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో దాదాపు 4.50 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, ఏకంగా 29.43 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఆటోమొబైల్, ఎయిర్లైన్ కంపెనీలకు డిజిటల్ ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 24న ముగుస్తుంది. ఆఫర్ ప్రైస్ బ్యాండ్ను రూ.475-500గా నిర్ణయించారు.
ఎగబడ్డ ధనిక ఇన్వెస్టర్లు
టాటా టెక్నాలజీస్ షేర్లను ఐపీవోలో దక్కించుకునేందుకు హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. రూ.10 లక్షలకు పైబడి మదుపు చేసే హై నెట్వర్త్ ఇండివీడ్యువల్స్ కోసం కేటాయించిన 52.73 లక్షల షేర్లకు 6 కోట్ల షేర్లను కోరుతూ బిడ్స్ అందాయి. రూ.2-10 లక్షల మధ్య ఇన్వెస్ట్చేసేవారి కోటాకు 11 రెట్లు బిడ్స్ వచ్చాయి. రూ.2 లక్షల లోపు మదుపు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు 1.85 కోట్ల షేర్లను రిజర్వ్చేయగా, అందుకు 5.4 రెట్లు 10 కోట్ల షేర్లకు సబ్స్క్రిప్షన్స్ అందాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం టాటా టెక్నాలజీస్ ఐపీవోలో భారీ ఎత్తున పాలుపంచుకున్నారు. ఈ ఇన్వెస్టర్ల కోటా 4 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. 4.29 కోట్ల షేర్లకు బిడ్స్రాగా, అందులో సగానికిపైగా విదేశీ సంస్థాగత ఇన్వెసర్లవే. దేశీయ ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు 81 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్ 37 లక్షలు, ఇతర క్యాటగిరీ దేశీయ సంస్థలు 17 లక్షల షేర్లకు బిడ్ చేశాయి.
డిసెంబర్ 5న లిస్టింగ్
టాటా టెక్నాలజీస్ స్టాక్ ఎక్సేంజీల్లో డిసెంబర్ 5న లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. సంస్థ ఈక్విటీ మూలధనంలో 15 శాతానికి సమానమైన 6,08,50,278 షేర్లను ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గా విక్రయిస్తున్నారు. మాతృసంస్థ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాల్ని ఆఫ్లోడ్ చేస్తున్నది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున షేర్లను విక్రయిస్తున్నాయి. ఇక గత నెలలో 9.9 శాతం వాటాను టీపీజీ రైజ్ ైక్లెమేట్కు రూ.1,613 కోట్లకు అమ్మేందుకు టాటా మోటార్స్ ఒప్పందంపై సంతకాలు చేసినది తెలిసిందే.