న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. బ్యాటరీలపై అయ్యే ఖర్చు తగ్గుముఖం పట్టడం వల్లనే కార్ల ధరలను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో నెక్సాన్.ఈవీ ధర రూ.1.2 లక్షల వరకు తగ్గనుండటంతో కారు ధర రూ.14.49 లక్షలకు దిగిరానున్నది. అలాగే టియాగో.ఈవీ మాడల్ రూ.70 వేలు తగ్గించడంతో ఈ కారు ప్రారంభ ధర రూ.7.99 లక్షలకు దిగొచ్చింది. కానీ, ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన పంచ్.ఈవీ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈవీల తయారీకి అయ్యే ఖర్చులో అత్యధికంగా బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సివస్తున్నది.. ఇటీవలకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యాటరీ సెల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సంస్థకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించడంలో భాగంగానే కార్ల ధరలను తగ్గించామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ అధికారి వివేక్ శ్రీవాత్సవ తెలిపారు.
ఈవీలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని వీటికి డిమాండ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా ఈవీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొంది. 2023లో ఈవీ సెగ్మెంట్ 90 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ప్యాసింజర్ వాహన విభాగం కేవలం 8 శాతం వృద్ధిని సాధించిందని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఈవీల విక్రయాలు 100 శాత వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని తెలిపింది.