హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో అఫ్గాన్కు 126.22 మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరపాలన్న లక్ష్యం నెరవెరే సూచనలు కన్పించడం లేదని ఆయన మంగళవారంనాడిక్కడ చెప్పారు. ఇప్పుడు తాలిబాన్ల అధీనంలో ఉన్న ఆ దేశానికి ఉత్పత్తుల్ని పంపడానికి భారత్ ఫార్మా ఎగుమతిదారులు వెనుకంజ వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ఫార్మా ఎగుమతి సంస్థలకు అఫ్గానిస్థాన్తో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఫార్ములేషన్స్, వాక్సిన్లతో సహా 126.22 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. ఎగుమతుల్ని నిలిపివేయమంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఆయన స్పష్టంచేశారు. ఫార్మాక్సిల్ గణాంకాల ప్రకారం 2019-20లో 90 మిలియన్ డాలర్లు, 2020-21లో 97 మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు అఫ్గాన్కు ఎగుమతయ్యాయి. ఆ దేశానికి పాకిస్థాన్ తర్వాత భారత్ నుంచే అధికంగా ఫార్మా ఎగుమతులు జరుగుతాయి. వాక్సిన్లు నేరుగా ఆ దేశానికి ఎగుమతికావని, పలు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) వాక్సిన్లను భారత్ కంపెనీల నుంచి సేకరించి, అఫ్గాన్కు పంపిస్తాయని ఫార్మా వాణిజ్య నిపుణుడొకరు వివరించారు.