ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఏడు రోజుల వరుస ర్యాలీ నుంచి గురువారం విరామం తీసుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ (RBI) ప్రకటించడంతో సూచీలు శుక్రవారం సరికొత్త గరిష్ఠాలను తాకాయి. తర్వాత అమ్మకాల సెగతో ఓ దశలో దాదాపు ఫ్లాట్గా మారాయి. తిరిగి కొనుగోళ్ల అండతో వెంటనే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. దీంతో వరుసగా ఆరో వారమూ ప్రధాన సూచీల్లో నికరంగా లాభాలు నమోదయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 69,666.38 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 69,893.80 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20,934.10 దగ్గర ప్రారంభమై రోజులో 21,006.10 వద్ద ఆల్టైం గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.38 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్-30 సూచీలో హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. ఐటీసీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, మారుతీ, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. కాగా ఆర్బీఐ వరుసగా ఐదోసారీ రెపోరేటును 6.5 శాతం దగ్గర యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సూచీలు భారీగా పుంజుకున్నాయి.
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ పెంచడం కూడా మార్కెట్లకు సానుకూలంగా మారింది.