Sensex | అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో వరుసగా రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐటీ స్టాక్స్ లబ్ధి పొందాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 945 పాయింట్ల వరకు నష్టపోయింది. ఒకానొక దశలో 58,699 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 170 పాయింట్ల లాభంతో 59,500 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ఇంట్రా డే ట్రేడింగ్లో 17,406 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. తిరిగి ముగింపు సమయానికి 243 పాయింట్లు పుంజుకుని 45 పాయింట్ల లబ్ధితో 17,649 పాయింట్ల వద్ద స్థిర పడింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్తోపాటు బజాజ్ ట్విన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, విప్రో, మారుతి, రిలయన్స్ 1-5 శాతం మధ్య లబ్ధి పొందాయి. మరోవైపు పవర్గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్యూఎల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ మూడు శాతం వరకు నష్టాలను చవి చూశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 0.2 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఒకశాతం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన పీఎస్బీ ఇండెక్స్ లాభ పడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ గరిష్టంగా మూడు శాతం వరకు పతనమైంది.
స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నా, అదానీ గ్రూప్ స్టాక్స్కు ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమప స్పందన లభించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ 1.4 నుంచి నాలుగు శాతం వరకు లాభాలతో ముగిశాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ 15-20 శాతం నష్టపోయాయి. అదానీ విల్మార్, అదానీ పవర్, ఎన్డీటీవీ ఐదు శాతం చొప్పున పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 66 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయింది.
డిసెంబర్ త్రైమాసికంతో ముగిసిన ఆర్థిక ఫలితాల్లో అత్యధికంగా 2,973 కోట్ల లాభాలు గడించిన బజాజ్ ఫైనాన్స్ సోమవారం ట్రేడింగ్లో దాదాపు ఐదు శాతం లబ్ధి పొందింది. అదానీ ఎంటర్పైజెస్ ఓఎఫ్ఎస్లో కేవలం రెండు శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. సంస్థ 4,55,06,791 షేర్లకు గాను 9,10,140 షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేశారు.