Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలుగా గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడంతో సెంటిమెంట్ బలపడింది. ఓ దశలో సెన్సెక్స్ 66వేల మార్క్ను దాటి 670 పాయింట్లు వరకు లాభపడింది. చివరకు అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలతోనే ముగిసింది. గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.
సెన్సెక్స్ 65,667 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 66,064 గరిష్ఠానికి చేరింది. చివరిలో అమ్మకాల ఒత్తిడితో 164.99 పాయింట్లు లాభపడి 65,558.89 పాయింట్ల స్థిరపడింది. నిఫ్టీ సైతం ఒక దశలో 19,500 మార్క్ను దాటింది. చివరకు 29.45 పాయింట్ల లాభంతో 19,413.75 వద్ద ముగిసింది. నిఫ్టీలో గురువారం హెచ్డీఎఫ్సీ షేరు 1.4శాతం పెరిగింది. అదే సమయంలో జొమాటొ, పీపీ ఫిన్టెక్ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నారు. మరో వైపు తొలి త్రైమాసికంలో ఆశించిన ఫలితాలు లేకపోయిన టీసీఎస్ షేర్లు మూడుశాతానికిపైగా లాభపడ్డాయి.
ఇదిలా ఉండగా.. గురువారం ట్రేడింగ్లో దాదాపు 1,322 షేర్లు పురోగమించగా.. 2037 షేర్లు క్షీణించాయి. 129 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ ఇండ్ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలువగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బీపీసీఎల్, యూపీఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ రంగాల్లో అమ్మకాలు జరిగాయి. బ్యాంక్, మెటల్, రియాల్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో కొనుగోళ్లు సాగాయి.