ముంబై, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. తొలి త్రైమాసికంలో ఫలితాలు అంచనాలకు చేరుకోలేకపోవడంతో మదుపరులు బ్లూచిప్ సంస్థల షేర్లను భారీగా విక్రయించారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా సెల్లింగ్ బటన్ నొక్కడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇంట్రాడేలో 66,808 పాయింట్లను తచ్చాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 299.48 పాయింట్ల నష్టంతో 66,384.78 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 72.65 పాయింట్లు నష్టపోయి 19,672.35 వద్ద ముగిసింది. ఈ రెండు సూచీల గత సెషన్లో ఒక్క శాతానికి పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈవారంలోనే వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం ప్రకటించనుండటంతో మదుపరులు ముందస్తు జాగ్రత్తగా అమ్మకాలకు మొగ్గుచూపారు. తొలి త్రైమాసికంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ సంస్థల ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోకపోవడంతో మార్కెట్లు తీవ్ర ఆటోపోటులకు గురయ్యాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసుల హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఫెడరల్ రిజర్వు సమావేశ నిర్ణయంపై మదుపరులు వేచి చూసి దోరణి అవలంభిస్తున్నారు.