దేశీయ స్టాక్ మార్కెట్లను 2023 హుషారెత్తించింది.
మదుపరులు పెట్టుబడులతో శివమెత్తడంతో సూచీలు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి.
బీఎస్ఈ మార్కెట్ విలువ సైతం మునుపెన్నడూ లేనివిధంగా రూ.364 లక్షల కోట్లను దాటేసింది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, జీడీపీ వృద్ధి ర్యాలీకి దోహదం చేశాయి.
Stock Market | ముంబై, డిసెంబర్ 29: భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆల్టైమ్ హై రికార్డులతో సూచీలు అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయగా, ఆయా షేర్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 11,399.52 పాయింట్లు (18.73 శాతం) ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 3,626.10 పాయింట్లు (20 శాతం) పుంజుకున్నది. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.3,64,28,846.25 కోట్ల వద్ద ఉన్నది. గత ఏడాది ముగింపుతో పోల్చితే రూ.81,90,598.32 కోట్లు పెరిగినట్టు తేలింది. దేశ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉండటం, జీడీపీ గణాంకాలు ఆకర్షణీయంగా నమోదు కావడం, రాజకీయ సుస్థిరత కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్ల కోతలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సంకేతాలివ్వడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందని అంటున్నారు.
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకే లోనయ్యాయి. మదుపరులు అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. చివరకు పెట్టుబడులకే ప్రాధాన్యతనివ్వడంతో సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించగలిగాయి. ఇక ద్రవ్యోల్బణం, అమెరికా బాండ్ ఈల్డ్స్, చైనా రియల్ ఎస్టేట్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-గాజా దాడులుసహా ఇతరత్రా రాజకీయ భౌగోళిక ఆందోళనలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు-ఉపసంహరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధానాలు, రూపాయి మారకం విలువ.. దేశీయ స్టాక్ మార్కెట్ కదలికల్ని ఈ ఏడాదంతా ఎక్కువగా ప్రభావితం చేశాయి.
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లలోకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) జోరుగా వచ్చాయి. దీంతో 2023లో వచ్చిన ఐపీవోలు మొత్తం 57గా నమోదయ్యాయి. 2021 (63 ఐపీవోలు) తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో ఐపీవోలు రావడం ఇదే తొలిసారి. ఒక్క డిసెంబర్లోనే 12 ఐపీవోలు రావడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఐపీవోల్లో ఆయా సంస్థలు దాదాపు రూ.49,000 కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టాటా టెక్నాలజీస్, ఐడియాఫోర్జ్ వంటి ప్రముఖ సంస్థలూ ఉన్నాయి. కాగా, వచ్చే ఏడాదీ భారీ ఎత్తునే ఐపీవోలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో 60కిపైగానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు రావచ్చన్న అంచనాలున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదికి నష్టాలతో వీడ్కోలు పలికాయి. 2023లో ట్రేడింగ్కు చివరి రోజైన శుక్రవారం సెన్సెక్స్ 170.12 పాయింట్లు లేదా 0.23 శాతం పడిపోయి 72,240.26 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 327.74 పాయింట్లు నష్టపోయినా.. తిరిగి కోలుకున్నది. నిఫ్టీ సైతం 47.30 పాయింట్లు లేదా 0.22 శాతం క్షీణించి 21,731.40 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 101.8 పాయింట్లు పతనమైనా.. ఆ తర్వాత తేరుకున్నది. నిజానికి ఉదయం ఆరంభం నుంచీ సూచీలు నీరసంగానే ట్రేడ్ అయ్యాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. సెన్సెక్స్లో ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టైటాన్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నిరాశపర్చాయి. రంగాలవారీగా చమురు-గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1.10 శాతం నుంచి 0.05 శాతం వరకు కోల్పోయాయి. కాగా, బీఎస్ఈ మిడ్క్యాప్ 0.85 శాతం, స్మాల్క్యాప్ 0.69 శాతం చొప్పున పెరిగాయి. ఇక ఈ వారం మొత్తంగా చూసినైట్టెతే సెన్సెక్స్ 1,133.3 పాయింట్లు (1.59 శాతం), నిఫ్టీ 382 పాయింట్లు (1.78 శాతం) పెరిగాయి. ఇక వరుసగా ఐదు రోజులు లాభాలు రావడంతో గురువారం సెన్సెక్స్ 72,410.38 పాయింట్ల ఆల్టైమ్ క్లోజింగ్ హై రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. నిఫ్టీ కూడా 21,778.70 పాయింట్ల సరికొత్త స్థాయి వద్ద నిలిచింది.
వడ్డీరేట్ల పెంపునకు ఆర్బీఐ విరామం ఇవ్వడం మదుపరులను ఉత్సాహపర్చింది. దేశ జీడీపీ గణాంకాలు కూడా మార్కెట్లను లాభాల్లో నడిపించాయి.
-సంపత్ రెడ్డి, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఐవో
దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుండటం, కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా నమోదవడం మార్కెట్ ర్యాలీకి దోహదం చేసింది.
-వీకే విజయకుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఐఎస్
2024 కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్నిస్తుందని నమ్మవచ్చు. అటు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపులు, ఇటు ఆర్బీఐ రెపో కోతలు కలిసి రాగలవు.
-సునీల్ న్యాతీ, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ ఎండీ