Stock market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) ఇవాళ ట్రేడింగ్ (Trading) ను స్వల్ప లాభాలతో ముగించాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు.. చివరి గంటలో ఐటీ షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో నష్టాల నుంచి బయటపడి ఫ్లాట్గా ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఐటీ రంగం మార్కెట్లను నిలబెట్టింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 47.01 పాయింట్లు లాభపడి 77,616.40 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.10 పాయింట్లు మాత్రమే పెరిగి 24,211 వద్ద నిలిచింది. రోజు మధ్యలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ చివరి సెషన్లో పుంజుకోవడం గమనార్హం. ఇవాళ్టి ట్రేడింగ్లో ఐటీ రంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల షేర్లు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా నిలిచాయి. దాంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మిగిలిన రంగాల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. దీనికి విరుద్ధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్ సూచీలు అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి.
బ్రాడర్ మార్కెట్లోనూ సానుకూల వాతావరణం కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.03 శాతం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇదిలావుంటే కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 4 శాతానికిపైగా పెరగడంతో భారత్ దిగుమతుల బిల్లుపై ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా డాలర్తో రూపాయి మారకం విలువ 0.26 శాతం బలహీనపడి 95.60 వద్ద ట్రేడయ్యింది.