పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రభావంతో ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. దాదాపు అన్ని దేశాల ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చవిచూడగా, అమెరికా, యూరప్ సూచీలు నిలువునా కుప్పకూలాయి. ఈక్విటీమార్కెట్ల నుంచి నిధులు బయటకు వస్తున్నందున అమెరికా డాలర్ బాగా బలపడింది.
డాలర్ బలం కారణంగా వర్థమాన దేశాల కరెన్సీలు క్షీణించాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థల రికవరీకి విఘాతం కలుగుతుందన్న అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనమయ్యాయి. ఇతర ఫైనాన్షియల్ మార్కెట్లతో పాటే క్రూడ్ కూడా తీవ్ర పతనాన్ని చవిచూసింది. ఇంధన ధర దిగిరావడం మాత్రం భారత్కు ఊరటే.
ముంబై, జూలై 19: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నడుమ భారత్ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 587 పాయింట్ల క్షీణతతో 52,553 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో 15,752 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
స్టాక్ సూచీలు ఇంత భారీ నష్టాల్ని చవిచూడటం ఈ ఏడాది ఏప్రిల్ 30 తర్వాత ఇదే తొలిసారి. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు జపాన్ నుంచి ఇటు అమెరికావరకూ ఈక్విటీ మార్కెట్లు క్షీణించాయి.
కాగా సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.34 శాతం తగ్గింది. బాగా నష్టపోయిన షేర్లలో ఇండస్ఇంద్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్లు వున్నాయి. సెన్సెక్స్ షేర్లలో కేవలం నాలుగు మాత్రమే స్వల్పంగా పెరిగాయి.
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు రూ. 1.16 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 234.46 లక్షల కోట్లకు తగ్గింది.
భారత్ మార్కెట్తో పోలిస్తే ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాల స్టాక్ సూచీలు తీవ్ర పతనాన్ని చవిచూసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1.10 శాతం నష్టపోగా, ఆసియాలో జపాన్ నికాయ్ ఇండెక్స్ 1.25 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచి 2.23 శాతం చొప్పున నష్టపోయాయి.
యూరప్లోని ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 2.5-3 శాతం మధ్య క్రాష్ అయ్యాయి. గత శుక్రవారం 1 శాతం వరకూ నష్టపోయిన అమెరికా మార్కెట్ తాజాగా మరో 2.5 శాతం క్షీణించింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్స్టాప్గా పెరగడానికి కారణమైన క్రూడ్ ధరలు సోమవారం బాగా దిగివచ్చాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 7 శాతం క్షీణించి 69 డాలర్లస్థాయికి పడిపోయింది.
పెట్రో ఉత్పత్తి దేశాల సమాఖ్య ఒపెక్… క్రూడ్ సరఫరాను పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకోవడం క్రూడ్ ధర తగ్గడానికి ఒక కారణమైతే, డెల్టా కొవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయన్న ఆందోళన మరో కారణం.
స్టాక్ మార్కెట్తో పాటే రూపాయి సైతం క్షీణించింది. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో డాలర్తో పోల్చితే రూపాయి విలువ 31 పైసలు తగ్గుదలతో 74.88 వద్దకు చేరింది. ఇది మూడు నెలల కనిష్ఠం. అమెరికా డాలర్ బలపడుతున్న కారణంగా పలు వర్థమాన దేశాల కరెన్సీలు క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి కూడా తగ్గుతున్నదని ఫారెక్స్ నిపుణులు చెప్పారు.
డెల్టా వైరస్ కేసులు పెరుగుతున్నందున, ఆర్థిక వ్యవస్థల రికవరీ జాప్యంకావొచ్చన్న భయాలతో కరెన్సీ విలువ పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.