Stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు నష్టపోయింది. దీంతో 74,563.92 పాయింట్ల ముగిసింది. నిఫ్టీ కూడా 488 పాయింట్లు నష్టపోయింది. 23,151.10 వద్ద ముగిసింది. ఉదయం 75,450 పాయింట్ల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. తర్వాత 600 పాయింట్ల వరకు పడిపోయింది. తర్వాత మరింత నష్టపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ ఉదయం 150 పాయింట్ల నష్టంతో 23,450 వద్ద ప్రారంభమైంది. అనంతరం నిఫ్టీ కూడా భారీగా పడిపోయింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ చమురు ధరలు 0.49 శాతం పెరిగి 101 డాలర్లకు చేరింది. ఇండియాతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే సాగాయి. దక్షిణ కొరియా బెంచ్మార్క్ కాస్పి, జపాన్ నిక్కే 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ సెంగ్ ఇండెక్స్ అన్నీ నష్టాలే చవిచూశాయి. గురువారంతో పోలిస్తే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ మార్కెట్ స్వల్ప నష్టాలు చవిచూసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలకు పాల్పడితే, దేశీయ పెట్టుబడిదారులు కొనుగోళ్లపై దృష్టిపెట్టారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐఐలు) రూ.7,049.87 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (డీఐఐలు) కొన్నాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ 6,147 పాయింట్లు నష్టపోయింది.
ఫిబ్రవరి 27న సెన్సెక్స్ 81,287 పాయింట్ల వద్ద ఉండగా, ఇప్పుడు 75,000 దిగువకు పడిపోయింది. మొత్తంగా రెండు వారాల్లోనే 7.5 శాతం పతనమైంది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 92.467 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు రోజు ఇది 92.19 వద్ద ముగిసింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం, చమురు సంక్షోభం, ధరల పెరుగుదల వంటివి నేటి మార్కెట్ పతనానికి కారణాలుగా చెబుతున్నారు విశ్లేషకులు.