ముంబై, జనవరి 4: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా గత రెండు రోజులుగా భారీగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 61 వేల పాయింట్ల దిగువకు జారుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 636.75 పాయింట్లు లేదా 1.04 శాతం తగ్గి 60,657.45 వద్దకు జారుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 189.60 పాయింట్లు తగ్గి 18,042.95 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మార్కెట్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
టాటా స్టీల్ 2.32 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు పవర్ గ్రిడ్, టాటా మోటర్స్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ నష్టపోయాయి. కానీ, మారుతి సుజుకీ, టీసీఎస్లు మాత్రమే లాభపడ్డాయి. ప్రస్తుత సంవత్సరంలోనే నిఫ్టీ 50 ఇండెక్స్ సూచీ 20 వేల పాయింట్లకి చేరుకోనున్నదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనావేస్తున్నది. ప్రస్తుతం ఈక్విటీలు ఆటుపోటులకు గురవుతుండటం, మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ దీర్ఘకాలికంగా సూచీలు మరింత బలపడే అవకాశాలు మెండుగావున్నాయని విశ్లేషించింది.