Stock Market | గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొనవచ్చని అంటున్నారు. గత వారం ట్రేడింగ్ చివరి రోజున అమెరికా ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఆలస్యమవుతుందన్న అంచనాలు వ్యాపించాయి. అందువల్లే సూచీలు భారీ నష్టాలనూ చవిచూశాయి. అయితే ఈ ప్రభావం ఈ వారం ట్రేడింగ్పైనా కనిపించవచ్చు.
ఇక క్రిందటి వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కేవలం 5.7 పాయింట్లే పెరిగింది. 22,519.40 పాయింట్ల వద్ద నిలిచింది. దీన్నిబట్టి ఇన్వెస్టర్లు పెట్టుబడులపట్ల ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవచ్చు. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి. ఇక నిఫ్టీకి 22,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,000 మద్దతు స్థాయిగా చెప్పుకోవచ్చని మెజారిటీ నిపుణుల మాట. అయితే మార్కెట్ రికార్డు పరుగులు కొనసాగితే ఈ వారం 22,800-23,000 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా అంటున్నారు.