Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ ఓ దశలో 950 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్లో దాదాపు రూ.3.5 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశ మార్కెట్లపై సైతం ప్రభావం చూపాయి. వడ్డీరేట్ల పెంపు భయాలు ప్రస్తుతం ఇంకా మదుపరులను వెంటాడుతున్నాయి.
మరో వైపు అమెరికా మార్కెట్లు ఈ ఏడాదిలో అత్యధికంగా మంగళవారం నష్టాలను నమోదు చేశాయి. ఫిబ్రవరిలో వ్యాపార కార్యకలాపాలు ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరాయన్న గణాంకాల నేపథ్యంలో సూచీలు నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 928 షేర్లు పురోగమించగా.. 2,451 షేర్లు పతనమయ్యాయి. మరో 127 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. అత్యధికంగా నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి. ఐటీసీ, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. మార్కెట్ల ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.85 వద్ద నిలిచింది.
స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్ల పతనం కొనసాగుతున్నది. అదానీ కంపెనీయే కావాలని అనుకూల వ్యాసాలు రాయించిందని వికీపీడియా చేసిన ఆరోపణలు బుధవారం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీనికి తోడు నేటి మార్కెట్లలోని బలహీనతలు సైతం జతకావడంతో అదానీ షేర్ల పతనం తీవ్రమైంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ విల్మర్ షేర్లు ఐదుశాతం శాతం నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు అత్యధికంగా 11.08 శాతం నష్టపోయింది.