Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికాతో పాటు దేశీయ ద్రవ్యోల్బణ గణంకాలతో పాటు ఐటీ సంస్థల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దాంతో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ నష్టాల్లోనే కొనసాగగా.. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడ్డట్టయ్యింది. ఇవాళ ఉదయం 65,759 వద్ద లాభాల్లో సెన్సెక్స్ ప్రారంభమైంది. చివరికి 223.94 పాయింట్ల నష్టంతో 65,393.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 55.10 పాయిట్ల నష్టంతో 19,384.30 వద్ద వద్ద ముగిసింది. సెన్సెక్స్లో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించగా.. ఐటీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. ఇదిలా ఉండగా.. బుధవారం టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ తొలి త్రైమాసిక గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ లాభం 17శాతం పెరిగి రే.11,074 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక గణాంకాల ప్రకటన తర్వాత.. కంపెనీ ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్ ప్రకటించింది. దాంతో ఉద్యోగులకు 12 నుంచి 15శాతం వరకు జీతం పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.