Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెలికాం స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆరంభంలో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్ 344.29 పాయింట్ల నష్టంతో 57,555.90 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 71.15 పాయింట్లు క్షీణించి.. 16,972.15 వద్ద స్థిరపడింది. వారంలోని మూడో ట్రేడింగ్ రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ షేర్లు రెండు శాతం చొప్పున నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ మార్చి 15న రూ.255.76 లక్షల కోట్లకు క్షీణించింది.
మార్చి 9న బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 264.30లక్షల కోట్లు. ఈ పరిస్థితుల్లో గత ఐదురోజుల్లో పెట్టుబడుదారులు సుమారు రూ.8.5లక్షలకోట్లు నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఇవాళ ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఒక దశలో 500 పాయింట్లు వరకు పెరిగింది. ఆ తర్వాత యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాల కారణంగా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్లో ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, టైటాన్, ఎల్అండ్టీ, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్ మినహా మిగతా షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్, రిలయన్స్, హెచ్యూఎల్, నెస్లే నష్టపోయాయి. మెటల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.