Stock Market | ఇటీవల వరుసగా జోరుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ గరిష్ఠాన్ని చేరుతున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం సైతం జీవితకాల గరిష్ఠానికి చేరాయి. మరో వైపు చైనా వృద్ధి గణాంకాలు వెలువడిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం 66,148 పాయింట్ల వద్ద సెన్సెక్స్ మొదలై.. రోజంతా లాభాల్లోనే సెన్సెక్స్ కొనసాగింది.
ఇంట్రాడేలో 66,656 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 529.03 పాయింట్ల లాభంతో 66,589.93 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీలో తొలిసారిగా 19,700 పాయింట్లు దాటింది. చివరకు 146.95 పాయింట్ల లాభంతో 19,711.45 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోలు మద్దతు కనిపించింది. ట్రేడింగ్లో దాదాపు 2013 షేర్లు పురోగమించగా.. 1,559 షేర్లు క్షీణించాయి. 174 షేర్లు మారలేదు.
నిఫ్టీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఒక్కోశాతం చొప్పున పెరిగాయి. ఆటో మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఒకశాతం పెరగడంతో లాభాల్లో ముగిశాయి.