కరోనా మొదలు పెరుగుతూపోయిన ధరలు: ఐడీసీ
లాక్డౌన్లు, ప్లాంట్ల మూసివేత, రవాణా సమస్యల దెబ్బ
న్యూఢిల్లీ, మే 25: గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. లాక్డౌన్లు, ఉత్పాదక కేంద్రాల మూసివేతలతో రవాణాలో ఇబ్బందులు తలెత్తాయని, దీనివల్ల మార్కెట్లో ధరలు పెరిగాయని వివరించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు అమ్మకం ధర రూ.19,000లకు చేరిందని ఐడీసీ పేర్కొన్నది. సరిగ్గా రెండేండ్ల క్రితం రూ.15,100గా ఉన్నట్టు చెప్పింది. ఏడాదికిపైగా ఈ ధరలు స్థిరంగా పెరుగుతూపోగా, ఇప్పుడు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయన్నది.
మరో 5-10 శాతం ధరలు పైకి
దేశీయ మొబైల్ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం చాలా కంపెనీలు చైనాకు చెందినవే. దీంతో ఇప్పు డు ఆ దేశంలో విజృంభిస్తున్న కరోనా ప్రభావం.. ఈ కంపెనీలపై సహజంగానే పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో అమలవుతున్న లాక్డౌన్లతో చైనా పోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా భారత్కు దిగుమతులు ఆగిపోతుండగా, చిప్ల కొరత వచ్చిపడుతున్నది. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్ల ధరలు మరో 5 నుంచి 10 శాతం పెరగవచ్చన్న అంచనాలు పరిశ్రమ నిపుణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే పెరిగిన ఈ ధరల నేపథ్యంలో గడిచిన రెండేండ్లలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు మళ్లీ కొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే సమయం 22 నెలలకు పెరిగిందని కూడా తేలింది. ఇంతకుముందు 15 నెలల్లోపే మరో ఫోన్ను కొనేవారని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
రూ.27 వేలు-45 వేలదే హవా
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో రూ.18,000ల కంటే తక్కువ ధర కలిగిన మొబైల్స్ విక్రయాల వాటా దేశీయ మార్కెట్లో 16 శాతానికి పడిపోయింది. ఇక గడిచిన ఏడాదిలో రూ.18,000-27,000 శ్రేణిలో డిమాండ్ 14 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. అయితే రూ.27,000-45,000 శ్రేణిలో ఏకంగా 75 శాతం విక్రయాలు పుంజుకోవడం గమనార్హం. రూ.45,000ల కంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లకు 5 శాతం డిమాండ్ వృద్ధి చెందింది. ఈ సెగ్మెంట్లో యాపిల్ (ఐఫోన్) మొబైల్స్కు 60 శాతం ఆదరణ కనిపిస్తుండటం విశేషం.
ప్రీమియం ఫోన్లపైనే దృష్టి
ద్రవ్యోల్బణం దృష్ట్యా మొబైల్ తయారీ సంస్థ లు ప్రీమియం ఫోన్ల ఉత్పత్తిపైనే దృష్టి సారించా యి. రూ.15,000-8,000 శ్రేణిలో ఉండే మొ బైల్స్ తయారీకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాయి. తయారీ ఖర్చులు పెరగడం, లాభాలు తగ్గడం కూడా ఇందుకు కారణం. ఈ క్రమంలోనే గడిచిన రెండేండ్లలో చాలా సంస్థలు రూ.10,000ల కంటే తక్కువ ధరకు మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లను విడుదల చేయడమే ఆపేశాయి. పైగా 4జీ, 5జీ సేవల నేపథ్యంలో ప్రీమియం ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లకే డిమాండ్ కనిపించడం కూడా పరిశ్రమల ఆలోచనా వైఖరిలో మార్పు తెచ్చింది. తక్కువ ధరల్లో మొబైల్స్ను మార్కెట్కు పరిచయం చేసిన వెంటనే షియా మీ, సామ్సంగ్, రియల్మీ, ఒప్పో తదితర బ్రాండ్లన్నీ తమ మోడల్స్ ధరల్ని క్రమేణా పెంచుతూపోతున్న పరిస్థితులూ వచ్చిపడ్డాయి.
‘గడిచిన రెండేండ్లలో స్మార్ట్ఫోన్ మార్కెట్ను అనేక అంశాలు ప్రభావితం చేశాయి. 2020 జనవరిలో చైనాలో కరోనా మహమ్మారి విజృంభించిన దగ్గర్నుంచి అక్కడ లాక్డౌన్లు, ఫ్యాక్టరీలు మూతబడటం జరిగింది. దీనివల్ల విడిభాగాల ధరలు పెరిగాయి. ముఖ్యంగా సెమీకండక్టర్ల కొరత పరిశ్రమను వేధించింది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోయింది. రవాణా చార్జీలూ పెరిగాయి. ఫలితంగా తయారీ వ్యయం కనీసం 20 శాతం ఎగిసింది. దీంతో రిటైల్ మార్కెట్లో సగటున ధరలు 27 శాతం ఎగబాకాయి’ – నవ్కేందర్ సింగ్,
ఐడీసీ ఇండియా రిసెర్చ్ డైరెక్టర్
‘మరిన్ని ఫీచర్ల కోసం స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తున్న ప్రస్తుత వినియోగదారులకు కన్జ్యూమర్ ఫైనాన్స్ స్కీములు లాభదాయకంగా ఉన్నాయి. అయితే చాలామంది సెకండ్ హ్యాండ్, వారంటీలో తిరిగొచ్చిన, లోపాల్ని సరిచేసి మళ్లీ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన మోడల్స్పై దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే గతంతో పోల్చితే ఇప్పుడు 25 శాతం ఎక్కువ ధర పెట్టినా కొత్త మొబైల్ఫోన్లలో తాము ఆశించిన స్థాయిలో ఫీచర్లు ఉండటం లేదని సదరు కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే వీటీ కోసం వారంతా చూస్తున్నారు.
– చందూరెడ్డి, సంగీతా మొబైల్స్ డైరెక్టర్