smart phone offers | స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్. ఈసారి పండుగ సీజన్లో కొత్తకొత్త స్మార్ట్ఫోన్లు.. రకరకాల ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు పరిశ్రమ నిపుణులు. సాధారణంగా ఏటా పండుగ సీజన్ (సెప్టెంబర్ నుంచి జనవరి వరకు)లో మార్కెట్ అంతా సరికొత్త స్మార్ట్ఫోన్లు.. ధరల తగ్గింపుతో సందడిగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ సంబురం అంతంత మాత్రమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చితే కొత్త ఫోన్ల రాక తక్కువేనంటున్నారు. పైగా ఇప్పటికే ఉన్న స్మార్ట్ఫోన్ మోడల్స్ ధరలు 7 నుంచి 10 శాతం మేర పెరిగేందుకు వీలున్నదన్న సంకేతాలిస్తున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి సరఫరాలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని, ఏడాదిన్నరగా ఇంతేనని షియామీ అంటున్నది.
స్మార్ట్ఫోన్ కంపెనీలను విడిభాగాల కొరత వేధిస్తున్నది. ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్స్ సరఫరాలో ఇబ్బందులు తీవ్రతరంగా ఉన్నాయని ఆయా సంస్థలు చెప్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తుండటం, విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల్లో ఉండటం వంటివి మార్కెట్లో సెమీకండక్టర్ వినియోగాన్ని విపరీతంగా పెంచేసింది. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేదని, స్మార్ట్ఫోన్ల తయారీపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతున్నదని పరిశ్రమ వర్గాలు ఒకింత ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో చిప్ తయారీ లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మొబైల్ ఫోన్ ఇండస్ట్రీపై విడిభాగాల కొరత ప్రభావం మరో 6 నెలలు ఉండొచ్చని కౌంటర్పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాతక్ అన్నారు. దేశీయ పరిశ్రమకు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో చైనాలో పెరిగిన రవాణా చార్జీలు సైతం చిప్ కొనుగోళ్లను భారం చేస్తున్నాయి. దీంతో కొత్త మోడళ్ల తయారీ తగ్గిపోయి, ప్రస్తుత మోడళ్ల ధరలు పెరిగిపోయే పరిస్థితులున్నాయని చెప్తున్నారు. రిలయన్స్ జియో 4జీ స్మార్ట్ఫోన్ విడుదల కూడా చిప్ల కొరత కారణంగానే వాయిదా పడిందని గార్ట్నర్ ప్రధాన విశ్లేషకుడు కనిష్క చౌహన్ గుర్తుచేశారు. ఈ పరిస్థితి ఒక్క జియోకే కాదని, ఇతర సంస్థలకూ ఎదురవుతున్నదన్నారు.
ఈ ఏడాది జూన్లో దేశంలోకి స్మార్ట్ఫోన్ దిగుమతులు గతంతో పోల్చితే 82 శాతం పెరిగాయి. ఆయా కంపెనీల ద్వారా 3.3 కోట్లకుపైగా యూనిట్లు భారత్కు వచ్చాయి. ఇందులో షియామీ వాటానే అత్యధికంగా 28.4 శాతంగా ఉన్నది. ఆ తర్వాత సామ్సంగ్ 17.7 శాతంగా, వివో 15.1 శాతంగా, రియల్మీ 14.6 శాతంగా, ఒప్పో 10.4 శాతంగా ఉన్నట్లు రిసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ తెలియజేసింది.
‘వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులతో ల్యాప్టాప్, టాబ్లెట్, స్మార్ట్ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతోనే సెమీకండక్టర్ చిప్ తదితర విడిభాగాల కొరత ఏర్పడింది. అలాగే ఆయా దేశాల్లో కొనసాగుతున్న కరోనా ఆంక్షలు సైతం రవాణా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి’
– పంకజ్, ఐసీఈఏ జాతీయ అధ్యక్షుడు