Budget 2024-25 | త్వరలో లోక్సభ ఎన్నికలు జరుపనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కు వరుసగా ఇది ఆరో బడ్జెట్. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రతిపాదించిన రికార్డును నిర్మలా సీతారామన్ సొంతం చేసుకున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1962లో తొలిసారి, 1967లో రెండో తాత్కాలిక బడ్జెట్ను ప్రతిపాదించారు. పార్లమెంట్ చరిత్రలో ఆరు బడ్జెట్లు సమర్పించిన ఘనత ఆయనదే.
2014లో ఎన్నికల ముంగిట అప్పటి యూపీఏ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పీ చిదంబరం తాత్కాలిక బడ్జెట్ సమర్పిస్తూ ఉత్పాదకతను ప్రోత్సహించేందుకు కార్లు, ఎస్యూవీలు, టూ వీలర్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. అమెరికాలో లెమాన్ బ్రదర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పతనంతో నెలకొన్న ఆర్థిక మాంద్యం వెలుగులో 2009లోనూ ఎన్నికల ముంగిట అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గ్రామీణ రంగానికి రాయితీలు పెంచారు.
2004లో నాటి బీజేపీ నేత వాజపేయి సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా జస్వంత్ సింగ్ ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు రాయితీలు ప్రకటించారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 1952లో సీడీ దేశ్ముఖ్, 1957లో టీటీ కృష్ణమాచారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. కృష్ణమాచారి అత్యధికంగా 10 వార్షిక బడ్జెట్లు సమర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1996లో, అంతకుముందు 1991లో యశ్వంత్ సిన్హా, 1980లో ఆర్ వెంకట్రామన్, 1977లో హెచ్ఎం పటేల్, 1971లో వైబీ చవాన్ తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్కు సమర్పించారు.