హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సింగరేణి స్పీడ్ పెంచింది. ఈ ఏడాది కొత్తగా నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ తెలిపారు. శనివారం సింగరేణి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో కొత్త గనులపై పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. సరైన ప్రణాళికలతో అధికారులు ముందుకెళ్లాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని ప్రాంతాల జీఎంలకు సూచించారు. ఒడిశా రాష్ట్రంలో సంస్థ చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ గనులకు సంబంధించి చివరి దశ అనుమతుల కోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇందుకోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారని, ఈ నెల మూడోవారంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించడానికి మంత్రి ముందుకొచ్చినట్టు తెలిపారు. దీంతో ఈ బ్లాక్నకు సంబంధించి చివరి అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి రానున్న నైనీ బొగ్గు బ్లాక్లో కనీసంగా ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గుతోపాటు కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్ట్ గనిలో 30 లక్షల టన్నులు, ఇల్లెందు ఏరియాలో 10 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓపెన్ కాస్ట్ గనిలో 4 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సింగరేణి సిద్దమవుతున్నది. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా ఇతర రాష్ర్టాల్లో జాయింట్ వెంచర్ తో సోలార్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఉన్నతాధికారులకు బలరామ్ సూచించారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో ఉన్న కమర్షియల్ సోలార్ ప్రాజెక్టులపై అధ్యయనం చేసి, తుది నివేదికను సమర్పించాలని చెప్పారు.
మరోవైపు, సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఇంకా 76 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రెండో దశలో భాగంగా 232 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటునకు సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్నకు సంబంధించి టెండర్ ప్రక్రియతోపాటు రూ.700 కోట్లతో చేపడుతున్న ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ పనులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు.