న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ విజృంభించాయి. మంగళవారం తగ్గినప్పటికీ.. బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి రూ.2 లక్షల ఎగువన రేటు పలికింది. హైదరాబాద్లో ఏకంగా కిలో రూ.2,08,000గా నమోదైంది. దీంతో సామాన్య వినియోగదారులతోపాటు ఇటు పరిశ్రమల నుంచి, అటు మదుపరుల నుంచి డిమాండ్ కనిపిస్తుండటమే ఈ ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఢిల్లీలో కిలో ఆల్టైమ్ హై స్థాయిని తాకుతూ కేజీ రూ.2,05,800గా ఉన్నది. ఈ ఒక్కరోజే రూ.7,300 ఎగబాకడం విశేషం.
హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,33,000గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రూ.1,23,300గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ తులం రూ.1,36,500గా ఉన్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. మంగళవారం ముగింపుతో పోల్చితే రూ.600 పెరిగిందని చెప్పింది. సోమవారం ఆల్టైమ్ హైని చేరి రూ.1,37,600 పలికిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తులం బంగారం విలువ రూ.58,650 పెరిగింది. కిలో వెండి ధర రూ.1,16,100 ఎగిసింది.
గత ఏడాది డిసెంబర్ 31న బంగారం 10 గ్రాముల రేటు రూ.78,950గా, వెండి కిలో ధర రూ.89,700గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ బుధవారం 4,321.06 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ ఔన్స్ 66.52 డాలర్లు. మంగళవారంతో పోల్చితే ఇవి వరుసగా 18.59 డాలర్లు, 2.77 డాలర్ల చొప్పున పెరిగాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చిత స్థితి నడుమ బంగారంతోపాటు వెండిని కూడా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నాయి. ఈ పరిణామం కూడా గ్లోబల్ మార్కెట్లో రేట్లను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.