ముంబై, ఫిబ్రవరి 5: ప్రపంచ మార్కెట్లలో వేగంగా రంగులు మారడంతో సోమవారం భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 400 పాయింట్ల మేర పెరిగి 72,386 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన బీఎస్ఈ సెన్సెక్స్.. ముగింపు సమయంలో హఠాత్ పతనాన్ని చవిచూసి 71,602 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు 354 పాయింట్ల నష్టంతో 71,731 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,964-21,726 పాయింట్ల మధ్య ఊగిసలాడి 82 పాయింట్లు కోల్పోయి 21,772 పాయింట్ల వద్ద ముగిసింది.
యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోతలు అంచనాలకు అనుగుణంగా ఉండవన్న భయాలతో ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనత దేశీయ ట్రెండ్ను దెబ్బతీసింది. రిలయన్స్ 1.3 శాతం మేర తగ్గడం సెన్సెక్స్ను నష్టాలకు గురిచేసింది. ఎయిర్టెల్ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో 3 శాతంపైగా తగ్గింది. క్యూ3 ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించడంతో టాటా మోటార్స్ సెన్సెక్స్ షేర్లలో 6 శాతం పెరిగి ఆల్టైమ్ రికార్డుస్థాయి రూ.928 వద్ద ముగిసింది.
ఎల్ఐసీ షేరు లిస్టయిన తర్వాత తొలిసారిగా రూ.1,000 స్థాయిని చూసింది. బీఎస్ఈలో తాజాగా ఇది 5.9 శాతం పెరిగి రూ.1,000.35 వద్ద ముగిసింది. దీంతో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లను దాటి రూ.6,32,721 కోట్లకు చేరింది. షేరు ఇంట్రాడేలో 1,028 గరిష్ఠాన్ని తాకింది. రూ.949 ధరతో ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ 2022 మే నెలలో లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ షేరు 2023 మార్చిలో రూ.530 కనిష్ఠానికి పతనమయ్యింది.