ముంబై, డిసెంబర్ 5: మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం చరిత్రలో తొలిసారిగా 69,000 శిఖరాన్ని అధిరోహించింది. నిఫ్టీ 20,800 పాయింట్ల రికార్డుస్థాయిని దాటేసింది. పవర్, బ్యాకింగ్, యుటిలిటీ స్టాక్స్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ మరో 431 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ రికార్డుస్థాయి 69,296 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్ల లాభాన్ని జతచేసి 20,855 పాయింట్ల వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ హాంగ్సెంగ్ 2.07 శాతం, జపాన్ నికాయ్1.37, చైనా షాంఘై 1.67 శాతం చొప్పున తగ్గాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూఎస్ సూచీలు కడపటి సమాచారం అందేసరికి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
తాజా మార్కెట్ ర్యాలీకి పవర్ షేర్లు నేతృత్వం వహించాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా పవర్గ్రిడ్ 4.46 శాతం, ఎన్టీపీసీ 3.89 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు 2 శాతంపైగా లాభపడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, మారుతిలు 1-2 శాతం మధ్య ఎగిసాయి. సెన్సెక్స్ షేర్లలో 20 స్టాక్స్ లాభపడ్డాయి. మరోవైపు హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్లు 1.49 శాతం వరకూ బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో యుటిలిటీస్ ఇండెక్స్ భారీగా 6.54 శాతం పెరిగింది. పవర్ ఇండెక్స్ 6.09 శాతం ఎగిసింది. సర్వీసుల సూచి 3.93 శాతం, కమోడిటీస్ సూచి 2.04 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.84 శాతం పెరగ్గా, బ్యాంకెక్స్ 1.21 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.17 శాతం చొప్పున పెరిగాయి. రియల్టీ ఇండెక్స్, ఐటీ, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, హెల్త్కేర్, ఎఫ్ఎంసీజీ సూచీలు స్వల్పం గా నష్టపోయాయి.
చాలా రోజుల తర్వాత విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం భారీగా కొనుగోళ్లు జరిపారు. స్టాక్ ఎక్సేంజీల సమాచారం ప్రకారం తాజా గా రూ.5,223 కోట్ల నిధుల్ని నికరంగా ఇన్వెస్ట్చేశారు. సోమవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,073 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
నిఫ్టీ భారీ గ్యాప్అప్తో ప్రారంభమై, ముగింపు సమయానికి మరింత పెరగడం సాంకేతికంగా సానుకూలాంశమని, వచ్చే కొద్ది రోజుల్లో ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే చెప్పారు. పుట్ ఆప్షన్ పొజిషన్లు హయ్యర్ స్ట్రైక్ స్థాయిలకు మారిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో మరిన్ని లాభాల్ని చూసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. 20,400 దిగువకు తగ్గనంతవరకూ నిఫ్టీ 21,000 స్థాయిని అందుకునే అవకాశాలున్నాయని విశ్లేషించారు.
అదానీ గ్రూప్ కార్పొరేట్ ఫ్రాడ్కు పాల్పడిందంటూ యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు సహేతుకం కాదంటూ యూఎస్ ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐడీఎఫ్సీ) ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలతో అదానీ గ్రూప్ షేర్లు పెద్ద పెట్టున ర్యాలీ జరిపాయి. అదానీ పోర్ట్స్ శ్రీలంకలో నిర్మిస్తున్న పోర్టుకు ఐడీఎఫ్సీ తాజాగా 553 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీలు 20 శాతం చొప్పున పెరిగి అప్పర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 19.95 శాతం ఎగిసింది. ఎన్డీటీవీ18 శాతం పెరిగింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 17 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 15 శాతం, అంబూజా సిమెంట్స్, ఏసీసీలు 8 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి.
సోమవారం ఒక్కరోజే రూ.5.81 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద మంగళవారం మరో రూ.2.5 లక్షల కోట్లు జత అయ్యింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ కొత్త రికార్డుస్థాయి రూ.350 లక్షల కోట్లకు చేరింది.డాలర్ల రూపేణా గత శుక్రవారమే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించిన సంగతి తెలిసిందే.
వరుసగా రెండు రోజులు గ్యాప్అప్తో ప్రారంభంకావడం పటిష్ఠమైన నిఫ్టీ అప్ట్రెండ్ను సూచిస్తున్నదని, 20,910 పాయింట్లను దాటితే కొద్ది రోజుల్లో 21,550 వరకూ పెరిగే చాన్స్ ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి అంచనా వేశారు. 20,710 పాయింట్ల వద్ద తాత్కాలిక మద్దతు లభిస్తున్నదని చెప్పారు. 21,000 స్థాయి నిఫ్టీకి అవరోధం కల్గించవచ్చని, 20,700 మద్దతు అందించవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు. దాదాపు ఇదే అంచనాల్ని బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ జెతిన్ గెడియా వెల్లడిస్తూ 20,700 స్థాయి వద్ద కీలకమైన మద్దతు ఉన్నదని, 21,000-21,060 శ్రేణి నిరోధించవచ్చన్నారు.