ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లోనే మొదలైనా.. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయగా.. బ్యాంకింగ్, మెటల్ రంగాలు, కొన్ని చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 523 పాయింట్లు లేదా 0.73 శాతం క్షీణించి 71,072.49 వద్ద నిలిచింది.
అయితే ఒకానొక దశలో సూచీ 71,756.58 పాయింట్లకు పెరిగినా నిలబడలేకపోయింది. అలాగే మరో దశలో 70,922.57 పాయింట్లకు పడిపోయినా తిరిగి కోలుకున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 166.45 పాయింట్లు లేదా 0.76 శాతం పతనమై 21,616.05 వద్ద స్థిరపడింది. ‘ఫార్మా, ఐటీ రంగాలు మినహా అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనైతే ఇది మరింతగా ఉన్నది. మదుపరులు దాదాపు అన్ని పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లను అమ్మకానికి పెట్టారు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.
రంగాలవారీగా..
క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు కుప్పకూలాయి. వీటిలో యుటిలిటీస్ సూచీ గరిష్ఠంగా 3.60 శాతం పడిపోయింది. రియల్టీ 3.01 శాతం, పవర్ 2.90 శాతం, ఇండస్ట్రియల్స్ 2.92 శాతం, ఎనర్జీ 2.80 శాతం, మెటల్ 2.73 శాతం, చమురు-గ్యాస్ 2.56 శాతం చొప్పున క్షీణించాయి. కంపెనీలవారీగా.. టాటా స్టీల్ అత్యధికంగా 2.76 శాతం నష్టపోయింది. ఎన్టీపీసీ 2.72 శాతం, ఎస్బీఐ 2.26 శాతం మేర దిగజారాయి. ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 3.16 శాతం, మిడ్క్యాప్ సూచీ 2.62 శాతం చొప్పున క్షీణించాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా దేశాల సూచీల్లో జపాన్, చైనా లాభాల్లో ముగిశాయి. హాంకాంగ్ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో.. బ్రిటన్ సూచీ నష్టాల్లో ఉన్నది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.50 శాతం తగ్గి 81.78 డాలర్లుగా ట్రేడ్ అయ్యింది. ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) శుక్రవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో రూ.141.95 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్టు ఎక్సేంజీ గణాంకాలు చెప్తున్నాయి. నాడు సెన్సెక్స్ 167.06 పాయింట్లు, నిఫ్టీ 64.55 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే.