Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగినా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23%) శాతం లబ్ధితో 71,595 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 64 పాయింట్ల (0.30%) లాభంతో 21,782 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బ్లూచిప్ సెన్సెక్స్ స్టాక్స్ ఎస్బీఐ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ స్క్రిప్టులు 2-3 శాతం లబ్ధి పొందగా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే ఇండియా, టైటాన్, ఏషియన్ పెయింట్స్ కూడా పుంజుకున్నాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టాలతో ముగిశాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’ డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు నాలుగు రెట్ల (283%)తో రూ.138 కోట్ల నికర లాభం, గతేడాదితో పోలిస్తే ఆపరేషన్ల ద్వారా 69 శాతం రెవెన్యూ పెంచుకోవడంతో నాలుగు శాతానికి పైగా స్టాక్ విలువ పెరిగింది.
రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) పై వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆంక్షల అమలు విషయమై ఆర్బీఐ తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నది. దీంతో శుక్రవారం పేటీఎం స్టాక్ ఆరు శాతం నష్టపోయింది. గురువారం 10 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ను తాకిన సంగతి తెలిసిందే.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.4 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.4 శాతం, నిఫ్టీ హెల్త్ కేర్ ఒకశాతం లాభంతో ముగిశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.93 లక్షల కోట్లు నష్టపోయి రూ.286.28 లక్షల కోట్లకు పరిమితమైంది. బీఎస్ఈలో 2520 స్టాక్స్ నష్టాలతో ముగిస్తే, 1314 స్టాక్స్ లాభాలు గడిస్తే మరో 98 స్టాక్స్ యథాతథంగా కొనసాగాయి.