ముంబై, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 874.18 పాయింట్లు లేదా 1.53 శాతం ఎగబాకి 57,911.68 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 256.05 పాయింట్లు లేదా 1.49 శాతం ఎగిసి 17,392.60 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా విలువ అత్యధికంగా 3.50 శాతం పెరిగింది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్ షేర్లూ లాభాలను అందుకున్నాయి. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా మినహా అన్ని షేర్లూ పుంజుకోవడం విశేషం. కాగా, బుధ, గురువారాల్లో కలిపి మదుపరుల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగినైట్టెంది. భారీ సంస్థలతోపాటు మధ్య, చిన్నతరహా సంస్థల షేర్లలోనూ పెట్టుబడుల వరద పారింది.
గ్లోబల్ మార్కెట్లలోనూ..
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లూ లాభాల్లో కదలాడాయి. ఆసియాలోని ప్రధాన మార్కైట్లెన జపాన్, దక్షిణ కొరియా లాభాల్లో ముగిస్తే.. చైనా, హాంకాంగ్ నష్టాలకు పరిమితమయ్యాయి. అయితే ఐరోపా మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, అమెరికా ట్రెజరీ రాబడులు తగ్గినా ప్రపంచ మార్కెట్లలో బుల్ రన్ కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 15 పైసలు పుంజుకున్నది. 76.15 వద్ద ముగిసింది.
రూ.5.74 లక్షల కోట్లు జూమ్
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మదుపరుల సంపద ఈ రెండు రోజుల్లో లక్షల కోట్లు ఎగిసింది. బుధ, గురువారాల్లో బీఎస్ఈ 1,449 పాయింట్లు పుంజుకోవడంతో ఇందులో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.5,74,427.92 కోట్లు ఎగబాకి రూ.2,71,77,156.37 కోట్లకు చేరింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం.. దేశీయంగా మార్కెట్ సెంటిమెంట్ను పెంచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీఎస్ఈ స్మాల్క్యాప్ 1.33 శాతం, మిడ్క్యాప్ 1.28 శాతం చొప్పున బలపడ్డాయి. ప్రధానంగా ఆటో, కన్జ్యూమర్ గూడ్స్, ఫైనాన్స్, ఇండస్ట్రీ, ఐటీ రంగాల షేర్లు పెరిగాయి.