ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. హెవీవెట్ షేర్లు మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు లాభపడటంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 72 వేల మార్క్ను అధిగమించింది. 72,165 పాయింట్ల నుంచి 71,644 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్ చివరకు 227.55 పాయింట్లు పెరిగి 72,050.38 వద్ద ముగిశాయి. వాహన, ఎనర్జీ, యుటిలిటీ స్టాక్లకు డిమాండ్ అధికంగా ఉండటం కలిసొచ్చింది. మరో సూచీ నిఫ్టీ 70.70 పాయింట్లు పెరిగి 21,910.75 పాయింట్లకు చేరుకున్నది. చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లోకి వచ్చాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించింది.