Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 18.82 పాయింట్లు పతనంతో 60,672.72 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 17.90 పాయింట్ల నష్టంతో 17,826.70 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్లో 17 స్టాక్స్ నష్టాలను చవి చూడగా, 13 లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నందున అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాలు.. ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అంతర్జాతీయ పరిణామాలు సైతం ప్రతికూల ప్రభావం చూపాయి.
మంగళవారం ఉదయం 60,770.43 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రా డే ట్రేడింగ్లో 60,976.59 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, 60,583.72 పాయింట్ల కనిష్ట స్థాయి వద్దకు పడిపోయాయి. రిలయన్స్, ఎన్పీటీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ లాభ పడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, సన్ఫార్మా, విప్రో, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ స్క్రిప్ట్లు నష్టపోయాయి.
మరోవైపు, యూఎస్ షార్ట్ షెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుదేలైన అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ పతనం మంగళవారం కూడా సాగింది. అదానీ గ్రూప్ సంస్థల్లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో ఏడింటి స్క్రిప్ట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ 3.55 శాతం నష్టంతో ముగిసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ ఐదు శాతం చొప్పున నష్టపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని యూనిట్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో అంబుజా సిమెంట్స్ స్టాక్ 0.16 శాతం పుంజుకోగా, ఏసీసీ సిమెంట్స్ 1.23 శాతం నష్టంతో ముగిసింది. ఎన్డీటీవీ 0.38 శాతం, అదానీ పోర్ట్స్ 0.74 శాతం, అదానీ పవర్ ఐదు శాతం లాభాలతో స్థిర పడ్డాయి.
కాగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 17,905.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించి.. ఇంట్రా డే ట్రేడింగ్లో 17,924.90 పాయింట్ల గరిష్టానికి వెళ్లి, 17,800.30 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ-50 ఇండెక్స్లో అత్యధికంగా కోల్ ఇండియా నష్టపోయింది. కోల్ ఇండియాతోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, సన్ ఫార్మా, యూపీఎల్ తదితర 30 స్టాక్స్ పతనం అయ్యాయి. మరోవైపు ఎన్టీపీసీ, బ్రిటానియా, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లాభ పడ్డాయి.
నిఫ్టీలోని 11 సెక్టార్లలో తొమ్మిది సెక్టోరల్ ఇండెక్స్లు నష్టాలతోనే ముగిశాయి. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.79 శాతం, రియాల్టీ 1.20 శాతం నష్టపోయాగా, బ్యాంక్, ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్లలో స్వల్ప నష్టాలు నమోదయ్యాయి. ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు మాత్రమే మంగళవారం ట్రేడింగ్లో మెరిశాయి.