ముంబై, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లకు గౌతమ్ అదానీ సెగ గట్టిగానే తాకింది. వరుసగా రెండోరోజు సూచీలు అతలాకుతలమయ్యాయి. బ్యాంకింగ్, ఆర్థిక, యుటిలిటీ, చమురు రంగ షేర్లు కుప్పకూలడంతో సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అదానీ గ్రూపు ఆర్థిక స్థితిగతులపై హిండెన్బర్గ్ లేవనెత్తిన అంశాలు మార్కెట్లలో అలజడి సృష్టించాయి. అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చిన బ్యాంక్లు, ఆర్థిక సంస్థల షేర్లు అతలాకుతలమయ్యాయి. ఒక దశలో 1,200 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించింది. వారంతం ట్రేడింగ్ ముగిసే సరికి 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం నష్టంతో 59,330.90 వద్ద ముగియగా..ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం నష్టపోయి 17,604.35 వద్ద ముగిశాయి. ప్రస్తుత నెలలో ఒక్కరోజు ఇంతటి స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి.
కుప్పకూలిన బ్యాంకింగ్ రంగ షేర్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రధాన బ్యాంకులు అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో తమ షేర్లు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్న షేర్లు ప్రస్తుతం కుప్పకూలుతున్నాయి. అదానీ దెబ్బకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 5 శాతం పడిపోగా..ఐసీఐసీఐ బ్యాంక్ 4.41 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.43 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, కొటక్ బ్యాంక్ 2 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.96 శాతం నష్టపోయాయి. వీటితోపాటు రిలయన్స్ 1.9 శాతం, హెచ్డీఎఫ్సీ 1.87 శాతం పతనం చెందాయి. అలాగే టెక్ మహీంద్రా 1.97 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.71 శాతం, ఇన్ఫోసిస్ 1.60 శాతం, విప్రో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్, ఎల్అండ్టీ, టీసీఎస్, మారు తి, హెచ్యూఎల్, టాటా స్టీల్, ఎయిర్టెల్లు నష్టపోయాయి. కానీ, టాటా మోటర్స్, ఐటీసీ, మహీంద్రా, సన్ఫార్మా, ఎన్టీపీసీలు మదుపరులను ఆకట్టుకున్నాయి.
11 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు లబోదిబోమంటున్నారు. సూచీలు కుదేలుకావడంతో గత రెండు సెషన్లలో ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. వరుస సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,647.85 పాయింట్లు క్షీణించడంతో మదుపరులు రూ.10.73 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.10,73,957.29 కోట్లు కరిగిపోయి రూ.2,69,65,965.18 కోట్లకు పడిపోయింది.
పతనానికి కారణాలు
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో పడిపోయిన అదానీ ర్యాంక్
గౌతమ్ అదానీ సంపద కరిగిపోతున్నది. హిండెన్బర్గ్ నివేదికతో స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లన్నీ కుప్పకూలడం మొదలైంది. ఈ దెబ్బకు ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి అదానీ పడిపోయారు. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ లిస్ట్లో గౌతమ్ అదానీ సంపద శుక్రవారం నాటికి 100 బిలియన్ డాలర్ల దిగువకు చేరి 96.5 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. గడిచిన రెండు రోజుల్లో 22.7 బిలియన్ డాలర్లు (రూ.1,85,118.5 కోట్లు) పడిపోవడం గమనార్హం. అదానీ సంపదలో ఇది 19 శాతానికి సమానం.
ఒక్కరోజే 4 లక్షల కోట్లు..
అదానీ గ్రూపు షేర్ల లాభాల జైత్రయాత్రకు బ్రేక్పడింది. వరుసగా రెండు రోజు శుక్రవారం కూడా గ్రూపునకు సంబంధించిన షేర్లు ఏకంగా 20 శాతం వరకు పడిపోయాయి. బుధవారం లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్…శుక్రవారం ఏకం గా రూ.4.17 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి.