ముంబై, ఫిబ్రవరి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఐటీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు పతనం చెందడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 73 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన సూచీ చివరకు 352.67 పాయింట్ల నష్టంతో 72,790.13 వద్ద ముగిసింది. 30 షేర్ల సూచీల్లో 26 సూచీలు నష్టపోగా, కేవలం నాలుగు సూచీలు లాభాల్లో ముగిశాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనక్కి పడిపోయింది. 90.65 పాయింట్లు కోల్పోయి 22,122.05 వద్ద స్థిరపడింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. మధ్యాహ్నాం తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిరాశావాదంగా ఉండటం సూచీలను మరింత కుంగదీశాయి.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన దేశీయ బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ రంగ దిగ్గజ సంస్థల షేైర్లెన ఇన్ఫోసిస్, టీసీఎస్లతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ల షేర్లు నష్టపోవడం సూచీల నష్టాలకు ప్రధాన కారణమని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ 3.9 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. పెయింట్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్ ప్రవేశించడంతో కంపెనీ షేరు కుప్పకూలింది. వీటికి తోడు అమెరికా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో పెరుగుతుండటంతో దేశీయ ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
అలాగే టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి షేర్లు కూడా నష్టపోయాయి. కానీ, లార్సెన్ అండ్ టుబ్రో షేరు 2.36 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. పవర్గ్రిడ్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లెలు లాభపడ్డాయి. అమెరికా, భారత్ జీడీపీ గణాంకాలు విడుదలకానుండటం, యూరోజోన్ ద్రవ్యోల్బనం, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో మదుపరులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విక్రయాలకు మొగ్గుచూపారని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఇంచుమించు అన్ని రంగాలకు చెందిన షేర్లు పతనాన్ని మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ మెటల్ 1.27 శాతం తగ్గగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.25 శాతం, టెక్ 1.13 శాతం, ఐటీ 1.06 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు నష్టపోయాయి. సోమవారం 4,108 షేర్లు ట్రేడింగ్ జరగగా..2,268 షేర్లు నష్టపోగా, 1,710 షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ 130 షేర్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.392 లక్షల కోట్లు(4.73 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది.