Sensex | దేశీయ స్టాక్ మార్కెట్లపై అమెరికా ఫెడ్ రిజర్వు నిర్ణయం వరుసగా రెండో రోజు ప్రతికూల ప్రభావం చూపింది. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ నెగెటివ్ ట్రెండ్తో మొదలైనా మధ్యలో మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో పూర్తిగా నష్టాల్లో చిక్కుకున్నాయి. చివర్లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడంతో నష్టాలు పరిమిత స్థాయికి తగ్గాయి. అమెరికా ఫెడ్ రిజర్వు మరో 75 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు పెంచేసింది. పెరుగుతున్న ధరలను నియంత్రించే వరకు వడ్డీరేట్ల పెంపు ఉంటుందని స్పష్టమైన సంకేతాలివ్వడంతో అంతర్జాతీయంగా వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి.
గురువారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 60,511.57 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైంది. అంతర్గత ట్రేడింగ్లో సెన్సెక్స్ 60,994.37 పాయింట్లతో గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. తిరిగి 60,485.14 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 69.68 పాయింట్ల నష్టంతో 60,836.41 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 30.15 పాయింట్లు నష్టపోయి 18,052.70 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్పై రూపాయి మారకం విలువ మరో 10 పైసలు నష్టపోయి రూ.82.90 వద్ద నిలిచింది. బీఎస్ఈ-30 ఇండెక్స్లో 13 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఎస్బీఐ, టైటాన్, ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లబ్ధి పొందాయి. మరోవైపు, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలతో స్థిర పడ్డాయి.