Stocks | ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో సరి పెట్టుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనిశ్చితి నెలకొంది. ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30 48 పాయింట్ల పతనంతో 65,970 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 కేవలం ఏడు పాయింట్ల నష్టంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్లో టీసీఎస్, విప్రో భారీగా 1-1.5 శాతం నష్టపోగా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, నెస్ట్లే, ఇన్ఫోసిస్ సైతం పతనం అయ్యాయి. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒకశాతం, ఎఫ్ఎంసీజీ 0.45, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.37 శాతం నష్టాలతో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.71 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.82 శాతం తో లాభ పడ్డాయి. ఇదిలా ఉంటే బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.13, స్మాల్ క్యాప్ 0.14 శాతం లబ్ధి పొందాయి.
ఇదిలా ఉంటే, త్వరలో 3-4 కొత్త పాలసీలు మార్కెట్లోకి తెస్తామని ప్రకటించడంతో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 9.7 శాతం లాభ పడింది. ఒక్కో పేటీఎం షేర్ రూ.884 చొప్పున రూ.1441 కోట్ల విలువైన షేర్లు బ్లాక్ డీల్ కింద విక్రయించారన్న వార్తల మధ్య సంస్థ షేర్ మూడు శాతానికి పైగా నష్టంతో ముగిసింది.