మార్కెట్ తాజా పతనంతో రూ. 6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.6,02,338.56 కోట్ల మేర తగ్గి రూ.3,85,97,298 కోట్లకు చేరింది.
Stock Market | ముంబై, ఫిబ్రవరి 28: హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. బీఎస్ఈ సెన్సెక్స్ 790 పాయింట్లు పతనమై 72,305 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 873 పాయింట్లు నష్టపోయి 72,222 పాయింట్లను తాకింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21,951 పాయింట్ల వద్ద నిలిచింది. ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడ్డారని, ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడం, యూఎస్ డౌ ఫ్యూచర్లు నెగిటివ్లో కొనసాగడంతో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.
అలాగే యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల బాటను నిర్దేశించే అక్కడి వ్యక్తిగత వినియోగ, వ్యయ గణాంకాలు వెల్లడికానున్నందున, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు వెనుకడుగు వేశారన్నారు.ఆసియాలో సియోల్ లాభపడగా, టోక్యో, షాంఘై, హాంకాంగ్లు తగ్గాయి. యూరప్ మార్కెట్లలో జర్మనీ డాక్స్ సూచి స్వల్పంగా లాభపడగా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇండెక్స్లు నష్టాలతో ముగిసాయి. ఎఫ్పీఐలు రూ.1,879 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు మార్కెట్ గణాంకాలు వెల్లడించాయి.
పవర్గ్రిడ్ టాప్ లూజర్
సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా పవర్గ్రిడ్ 4.43 శాతం పతనమయ్యింది. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం క్షీణించి ఇండెక్స్ 185 పాయింట్లు కోల్పోవడానికి కారణమయ్యింది. మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, రిలయన్స్, టైటాన్ షేర్లు సైతం 1-2 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు హిందుస్థాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, భారతి ఎయిర్టెల్లు స్వల్ప లాభాలతో ముగిసాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.94 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 1.82 శాతం చొప్పున తగ్గాయి. రంగాలవారీగా చూస్తే అన్నింటికంటే అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 2.82 శాతం పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.19 శాతం, రియల్టీ 2.12 శాతం, టెలికం సూచి 1.92 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.89 శాతం, కమోడిటీస్ సూచి 1.85 శాతం మేర తగ్గాయి. బీఎస్ఈలో లిస్టయిన షేర్లలో 2,863 షేర్లు నష్టపోగా, 881 షేర్లు లాభపడ్డాయి.
వొడాఫోన్ ఐడియా 14 శాతం డౌన్
టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రకటించిన భారీ నిధుల సమీకరణ ప్రణాళికను ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మెరుగుపర్చకపోవడంతో ఆ షేరు 14 శాతం పతనమై రూ.13.65 వద్ద ముగిసింది. రూ.20,000 కోట్లు ఈక్విటీగానూ, రూ.25,000 కోట్లు రుణపత్రాల జారీద్వారానూ సమీకరించనున్నట్టు వొడాఫోన్ ఐడియా వెల్లడించిన సంగతి తెలిసిందే. పేటీఎం బ్రాండ్తో వ్యాపారం చేస్తున్న ఒన్97 కమ్యూనికేషన్స్ 5 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ వద్ద నిలిచింది.