Stocks | ఉక్రెయిన్-రష్యా మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలతో సోమవారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1747 పాయింట్లు (మూడు శాతం) నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 532 పాయింట్ల పతనంతో 16,843 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫలితంగా ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నారు. ఒక్క సోమవారం ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.29 లక్షల కోట్లు హరించుకుపోయింది.
శుక్రవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.263.47 లక్షల కోట్లు కాగా, సోమవారం ముగింపు సమయానికి రూ.255.11 లక్షల కోట్లకు పడిపోయింది. 2022లో ఇది గరిష్ఠ పతనం. ఇక టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ స్క్రిప్ట్లు భారీగా నష్టపోయాయి. టీసీఎస్ మాత్రమే లాభాల్లో సాగింది. దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.
అంతర్జాతీయంగా ఫ్రాంక్ఫర్ట్, పారిస్ స్టాక్ మార్కెట్లు మూడు శాతానికి పైగా పతనం కాగా, లండన్ రెండు శాతం, టోక్యో 2.2 శాతం నష్టపోయింది. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే సాగాయి. 48గంటల్లో అమెరికన్లు ఉక్రెయిన్ను వీడాలని వైట్హౌస్ ఆదేశించడంతో వాల్ స్ట్రీట్ బెంచ్మార్క్ ఎస్ అండ్ పీ ఇండెక్స్ శుక్రవారం 1.9 శాతం నష్టపోయింది.
రష్యాతోపాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఉక్రెయిన్లోని తమ పౌరులను వెనక్కు వచ్చేయాలని ఆదేశించడంతో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు పాల్పడితే ముడి చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ముడి చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి. అంతకుముందే అమెరికా తమ పౌరులు ఉక్రెయిన్ను వీడాలని ఆదేశించడంతో ఇప్పటికే ముడి చమురు ధరల్లో పెరుగుదల నమోదవుతున్నది. 2014 అక్టోబర్ తర్వాత బ్యారెల్ ముడి చమురు ధర 96.16 డాలర్లకు చేరింది.
ఏబీజీ షిప్యార్డ్, దాని ప్రమోటర్లు బ్యాంకులను మోసగించారన్న ఆరోపణలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేయడంతో సెన్సెక్స్, నిఫ్టీల్లో బ్యాంక్ స్క్రిప్ట్లు ఒత్తిడికి గుయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ సుమారు 6 శాతం, ప్రైవేట్ బ్యాంకులతోపాటు బ్యాంకుల ఇండెక్స్ నాలుగు శాతానికి పైగా నష్టపోయింది.
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు 4 శాతం చొప్పున నష్టపోయాయి. క్రూడాయిల్ ధరలు ఏడేండ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి కూడా మార్కెట్ల పతనానికి ఓ కారణంగా కనిపిస్తున్నది. సెన్సెక్స్లో బ్యాంకింగ్స్ స్క్రిప్ట్ల్లో ఎస్బీఐ 5.2 శాతం, హెచ్డీఎఫ్సీ 5.3, ఐసీఐసీఐ బ్యాంక్ 4.50 శాతం నష్టపోయాయి. టాటా స్టీల్ 5.49 శాతం డౌన్ కాగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి 4 శాతానికి పైగా నష్టపోయాయి.
లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్, విప్రో, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్క్రిప్ట్లు మూడు శాతానికి పైగా పతనం అయ్యాయి. ఏషియన్ పేయింట్స్ రెండు శాతం నష్టపోగా, టైటాన్, రిలయన్స్, సన్ ఫార్మా, నెస్ట్లే కూడా డౌన్ అయ్యాయి. సెన్సెక్స్లో 256 స్క్రిప్ట్లు అప్పర్, 764 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ను తాకాయి. 2980 స్టాక్స్ నష్టపోగా, 571 స్క్రిప్ట్లు గెయిన్ అయ్యాయి. నిఫ్టీలో మిడ్ క్యాప్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇండెక్స్లు నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి.