Stock Market | ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపును పక్కకు పెట్టవచ్చన్న అంచనాల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 793.25 పాయింట్లు లేదా 1.06 శాతం దిగజారి 74,244.90 వద్దకు పడిపోయింది. ఒకానొక దశలో 848.84 పాయింట్లు కోల్పోవడం గమనార్హం.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 234.40 పాయింట్లు లేదా 1.03 శాతం క్షీణించి 22,519.40 వద్ద నిలిచింది. అంతకుముందు సూచీలు ఆల్టైమ్ హైల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా వడ్డీ కోతలకు ఇప్పట్లో వెళ్లబోదని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే రియల్టీతోపాటు, స్టీల్, ఆటో, బ్యాంకింగ్ తదితర కీలక రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే వీలుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చమురు-గ్యాస్, యుటిలిటీస్, రియల్టీ, బ్యాంకింగ్, కమోడిటీస్, ఐటీ, ఆర్థిక సేవల రంగాల షేర్లు గరిష్ఠంగా 1.28 శాతం వరకు నష్టపోయాయి. సన్ ఫార్మా, మారుతీ, పవర్గ్రిడ్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ, ఎస్బీఐ షేర్లు నిరాశపర్చాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 0.49 శాతం, 0.60Domestic శాతం చొప్పున పడిపోయాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్ ఒక్కటే లాభపడింది. దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి.
భారీ నష్టాలు బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ.400 లక్షల కోట్ల కిందికి దిగజార్చాయి. ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.2.52 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో రూ.3,99,67,051.91 కోట్లకు పరిమితమైంది. బుధవారం ముగింపుతో చూస్తే శుక్రవారం రూ.2,52,301.16 కోట్లు పడిపోయింది. అంతకుముందు మార్కెట్ విలువ ఆల్టైమ్ హైలో ఉన్న సంగతి విదితమే.