ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నది. ఎన్నికల ర్యాలీ కారణంగా గత ఐదు రోజులుగా భారీగా పెరిగిన సూచీ సోమవారం కూడా ఒక దశలో 77 వేల పాయింట్లను అధిగమించింది. మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో దేశీయ ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 203.28 పాయింట్లు కోల్పోయి 76,490.08 వద్ద ముగిసింది. ఒకదశలో 385 పాయింట్లు ఎగబాకి ఆల్టైం హైకీ 77,079.04 వద్దకు చేరుకున్నది. అటు మరో సూచీ నిఫ్టీ సైతం 30.95 పాయింట్లు కోల్పోయి 23,259.20 వద్ద స్థిరపడింది.